పెట్రోల్, డీజిల్పై 300% పెరిగిన ఆదాయం, భారీగా పెరిగిన పన్ను వసూళ్లు
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాకొద్దీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు డిమాండ్ పడిపోయి, ధరలు పడిపోయాయి. అయితే ఇక్కడ సెస్ విధించడంతో ధరలు తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బ్యారెల్కు 70 డాలర్లకు సమీపంలో ఉండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజిల్ పైన పన్ను వసూళ్లు గత ఆరేళ్ల కాలంలో 300 శాతం పెరిగాయి.
ఎక్సైజ్ రూపంలో రూ.2.94 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం 2014-15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్ పైన రూ.29,279 కోట్లు, డీజిల్ పైన రూ.42,881 కోట్లు వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కలిపితే 2014-15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ.74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఏకంగా రూ.2.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్పై పన్నుల వసూళ్లు రూ.2.94 లక్షల కోట్లకు పెరిగాయి.
ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఇలా
ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్స్ వసూళ్ల రూపంలో 2014-15లో 5.4 శాతంగా ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.2 శాతానికి పెరిగింది. పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ 2014లో లీటర్కు రూ.9.48గా ఉంది. ఇప్పుడు రూ.32.90కి పెరిగింది. డీజిల్పై రూ.3.56 నుండి రూ.31.80కి చేరుకుంది.
ఆరేళ్లలో ఖజానాకు పెరిగిన ఆదాయం
ఆరేళ్లలో ఖజానాకు పెరిగిన ఆదాయం రూ.2,21,840 కోట్లు. నవంబర్ 2014 నుండి జనవరి 2016 కాలంలో 15 నెలల్లో తొమ్మిది విడుతల్లో లీటర్ పెట్రోల్ పైన రూ.11.77, లీటర్ డీజిల్ పైన రూ.13.47 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ప్రస్తుత పెట్రోల్ ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లు కలిపి 60 శాతంగా ఉన్నాయి.