Export Tax: పెట్రోల్ డీజిట్ ఎగుమతులపై పెరిగిన టాక్స్.. పడిపోయిన ఆ కంపెనీల షేర్లు..
Tax on Petrol Diesel Export: మనలో చాలా మంది చమురు దిగుమతులపై టాక్స్ పెరగటం, తగ్గటం గురించి ఎక్కువగా వింటుంటాం. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై టాక్స్ పెంపు, తగ్గింపు గురించి అరుదుగా వింటుంటాం. ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గ్యాసోలిన్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను పెంచింది. అలాగే దేశీయ రిఫైనరీల ద్వారా వచ్చే ఆదాయాలపై అదనపు విండ్ఫాల్ పన్నును ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పెట్రోల్, ఏటీఎఫ్ ఇంధన ఎగుమతులపై లీటరుకు రూ.6 టాక్స్, డీజిల్ ఎగుమతులపై రూ.13 సుంకాన్ని విధించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేంద్రం నిర్ణయం వల్ల ఈ కంపెనీల లాభాలపై భారీగా ప్రభావం పడనుంది.
విండ్ఫాల్ లాభాలను అడ్డుకునేందుకు:
ప్రభుత్వ ప్రత్యేక ప్రకటన ప్రకారం.. అధిక అంతర్జాతీయ చమురు ధరల నుంచి ఉత్పత్తిదారులకు ప్రవహించే విండ్ఫాల్ ప్రయోజనాలను భర్తీ చేయడానికి స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై టన్నుకు రూ. 23,230 అదనపు పన్ను విధించింది. ఇటీవలి నెలల్లో క్రూడ్ ధరలు నాటకీయంగా పెరిగాయి. దేశీయ చమురు ఉత్పత్తి సంస్థలు.. దేశీయ రిఫైనరీలకు విదేశీ ధరలతో సమానంగా ముడి చమురును అందిస్తాయి. ఫలితంగా.. దేశీయ ముడి ఉత్పత్తిదారులు చక్కగా లాభపడుతున్నారు. ఈ సెస్ ఫలితంగా దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.
సెస్ నోటిఫికేషన్ వారికి వర్తించదు:
ఎగుమతి ఆధారిత రిఫైనరీలకు దేశీయ విక్రయాల కోసం సెస్ నోటిఫికేషన్ వర్తించదు. నియంత్రణ ప్రకారం ఎగుమతిదారులు తమ డీజిల్ ఉత్పత్తిలో 30 శాతాన్ని ముందుగా స్థానికంగా విక్రయించాలి. అంతేకాకుండా.. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక ముడి ఉత్పత్తి 2 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువగా ఉన్న చిన్న ఉత్పత్తిదారులు ఈ సెస్ నుంచి మినహాయించబడతారని కేంద్రం స్పష్టం చేసింది. అదనంగా.. గత సంవత్సరం ఉత్పత్తిని మించి ఉత్పత్తి చేసే క్రూడ్ పరిమాణంపై ఎటువంటి సెస్ ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
దేశీయ పంపులకు సరఫరా తగ్గింపుతో:
హై-స్పీడ్ డీజిల్, పెట్రోల్ ఎగుమతుల పెరుగుదలకు ప్రతిస్పందనగా ఇంధన ఎగుమతులపై సుంకం అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎగుమతులు మరింత లాభదాయకంగా మారడంతో, కొన్ని రిఫైనర్లు తమ దేశీయ పంపులకు సరఫరాలను తగ్గించి విదేశాలకు ఎగుమతి చేసి లాభపడుతున్నాయని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.