ఆ వ్యాక్సిన్ల సేకరణ రేటును పెంచిన మోడీ సర్కార్: రూ.150 నుంచి రూ.200కు పైగా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మొదట్లో కనిపించిన వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు ఉండట్లేదు. రాష్ట్రాల్లో నెలకొన్న డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తోంది. రాష్ట్రాలన్నింటికీ ఉచితంగా వాటిని అందించే బాధ్యతను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అయ్యే ఖర్చును భరిస్తోంది. ఇప్పటిదాకా 40 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు.
రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టాలెక్కింది.. సజావుగా సాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్కు చెందిన ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను విస్తృతంగా వినియోగమౌతోంది. అదే సమయంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను పరిమితంగా వినియోగిస్తోన్నారు.
కొన్ని డిజిగ్నేటెడ్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ వ్యాక్సిన్ను తీసుకునే వీలు ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ సేకరణ ధరను పెంచినట్లు వార్తలు వస్తోన్నాయి. కోవిషీల్డ్ డోసు ధరను 205 రూపాయలకు పెంచడంతో పాటు దానికి అదనంగా అయిదు శాతం జీఎస్టీని నిర్దేశించినట్లు తెలుస్తోంది. కోవాగ్జిన్ డోసు ధరను 215 రూపాయలు నిర్ధారించడంతో పాటు అయిదు శాతం జీఎస్టీని జత చేసినట్లు సమాచారం.
ఇదివరకు ఈ రెండు వ్యాక్సిన్ల సేకరణ ధర 150 రూపాయలుగా ఉండేది. దీనికి అయిదు శాతం జీఎస్టీ అదనం. ఈ ఏడాది డిసెంబర్ వరకు 37 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆర్డర్లను అందజేసింది. అదే సమయంలో- డిసెంబర్ వరకు 28.5 కోట్ల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ను సేకరించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి.