Atal pension scheme: మారిన అటల్ పెన్షన్ స్కీమ్ రూల్స్.. ఇకపై వారికి పథకం వర్తించదు.. ఎందుకంటే..
Atal pension scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాల్లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఇది. అయితే తాజాదా దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఈ మార్పుల కారణంగా కొంద మందికి ఈ ప్రయోజనం వర్తించదని, వారు ఇకపై దీని ప్రయోజనాన్ని పొందలేరని కేంద్రం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
ఎవరికి పెన్షన్ ప్రయోజనాలు నిలిచిపోతాయి..
ఎవరైన వ్యక్తి ఆదాయపుపన్ను శాఖ టాక్స్ చెల్లింపుల పరిధిలోకి వచ్చినట్లియితే అటల్ పెన్షన్ యోజన సౌకర్యాన్ని కోల్పోతారు. అంటే.. పన్ను చెల్లింపుదారులు ఇకపై దీని ప్రయోజనాన్ని పొందలేరు. అక్టోబర్ 1, 2022 తర్వాత పన్ను చెల్లింపుదారులు ఎవరూ అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు అర్హులు కాదని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. చందాదారుడు ఈ తేదీకి లేదా అంతకు ముందు పన్ను చెల్లింపుదారునిగా గుర్తించినట్లయితే, అతని అటల్ పెన్షన్ యోజన ఖాతా మూసివేయబడుతుందని స్పష్టం చేసింది. పైగా ఆ రోజు వరకు డిపాజిట్ చేయబడిన అతని పెన్షన్ తిరిగి ఇవ్వబడుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
సామాజిక భద్రత కల్పించేందుకు..
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సామాజిక భద్రత కల్పించేందుకుగాను రూపొందించింది. దీని కారణంగా అధిక ఆదాయం కలిగిన వారికి కాకుండా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు ప్రయోజనాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 99 లక్షలకు పైగా కొత్త అటల్ పెన్షన్ యోజన ఖాతాలు తెరవటం జరిగింది. ప్రస్తుతం ఈ స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్య మార్చి 2022 చివరి నాటికి 4.01 కోట్లకు చేరుకుంది.
లబ్ధిదారులకు ప్రయోజనాలు..
అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులు కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ పొందుతారు. మీరు 60 ఏళ్ల తర్వాత జీవితాంతం ప్రతి నెలా ఈ పెన్షన్ మెుత్తాన్ని వారు పొందుతూనే ఉంటారు. ఇందులో లబ్ధిదారుడు మరణించిన తర్వాత అతని జీవిత భాగస్వామికి ప్రతినెలా పూర్తి పింఛను అందిస్తారు. భార్యాభర్తలిద్దరూ మరణించిన తర్వాత.. అటల్ పెన్షన్ యోజన కింద పొదుపుచేసిన మొత్తం కార్పస్ పిల్లలకు అందిస్తారు. ఇందుకోసం నెలకు రూ.42 నుంచి అత్యధికంగా రూ.210 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయోజనం పొందడం ఎలా..?
అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి మీ అటల్ పెన్షన్ యోజన ఫారమ్ను తీసుకోండి. ఫారమ్లో వివరాలు నింపి బ్యాంకుకు సమర్పించాలి. ఫారమ్ను బ్యాంక్లో సమర్పించిన తర్వాత మీ అటల్ పెన్షన్ యోజన ఖాతా ప్రారంభించబడుతుంది. దీని ప్రీమియం మీరు కోరుకున్న విధంగా ప్రతి నెల లేదా సంవత్సరానికి ఆటో డెబిట్ విధానంలో వసూలుచేయబడుతుంది. మీకు 60 ఏళ్లు వచ్చిన వెంటనే పెన్షన్ ప్రయోజనం అందించటం ప్రారంభమవుతుంది.
ఆన్ లైన్ లో ఇలా..
ముందుగా మీరు అటల్ పెన్షన్ యోజన మొబైల్ యాప్ లేదా https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html లింక్కి వెళ్లాలి. ఆ తర్వాత మీరు APY అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ కార్డ్ వివరాలను అందించాలి. దీని తర్వాత.. ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. తగిన బ్రాకెట్లో వన్ టైమ్ పాస్వర్డ్ను నమోదు చేయాలి. దీని తర్వాత.. బ్యాంక్ వివరాలను అందించాలి. ఆ తరువాత మీరు ఇచ్చిన వివరాలను బ్యాంక్ ధృవీకరిస్తుంది. ఆపై మీ ఖాతా యాక్టివేట్ చేయబడుతుంది. దీని తర్వాత మీరు నామినీ, ప్రీమియం చెల్లింపు ఎంపికలు పూర్తి చేయాలి. చివరగా అటల్ పెన్షన్ యోజన కోసం మీ రిజిస్ట్రేషన్ ధృవీకరణ కోసం ఫారమ్పై ఈ-సంతకం చేయడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.