IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆఫర్లు..! కొనుగోలుదారులను మభ్యపెట్టేందుకేనా..?
IDBI Bank: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలోని కొన్ని సంస్థలను మరీ ముఖ్యంగా బ్యాంకులను విక్రయించాలని భావిస్తోంది. ఇందులో ఐడీబీఐ బ్యాంక్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా ఉన్న 60.72 శాతం వాటాను విక్రయించాలని భావిస్తున్నాయి. దీనికోసం అక్టోబర్లో సంభావ్య కొనుగోలుదారుల నుంచి బిడ్లను ఆహ్వానించటం జరిగింది.
ప్రలోభపెట్టేందుకు..
ఐడీబీఐ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రక్రియలో కొనుగోలుదారులను ప్రలోభపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రారంభ బిడ్ల దాఖలుకు గడువును జనవరి 7 వరకు పొడిగించింది.
ఈ క్రమంలో కొనుగోలుదారులకు కొన్ని పన్ను నిబంధనలపై ఉపశమనం ఇవ్వవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించటం చర్చనీయాంశంగా మారింది. తాయిలాలను ఆశచూపాలని చేస్తున్న ప్రయత్నంపై అందరూ మాట్లాడుకుంటున్నారు.
అధికారి ప్రకారం..
బ్యాంక్ ప్రైవేటీకరణలో భాగంగా పన్ను నిబంధనను సడలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరుతున్నట్లు అధికారి ఒకరు తెలిపినట్లు రాయిటర్స్ చెప్పింది. వాస్తవానికి ప్రస్తుతం తుది బిడ్ తర్వాత ఐడిబిఐ బ్యాంక్ షేరు ధర పెరిగితే కొనుగోలుదారు అదనపు పన్ను చెల్లించడం తప్పనిసరి. కొనుగోలు దారులకు ఇది ఇతర ఆదారయంగా పరిగణించబడుతుంది కాపట్టి.. సర్ ఛార్జ్ తో పాటు సెస్తో పాటు 30% పన్ను చెల్లించాలి. అందుకే ప్రభుత్వం ఈ నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
బిడ్ ప్రక్రియ..
ఆసక్తి వ్యక్తీకరణ లేదా ప్రారంభ బిడ్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 16గా ఉండగా దానిని జనవరి 7, 2023 వరకు పొడిగించటం జరిగింది. EOI కాపీలను సమర్పించడానికి చివరి తేదీని కూడా డిసెంబర్ 23 నుంచి జనవరి 14 వరకు పొడిగించారు.