అదానీకి కలిసిరానున్న రెగ్యులేటరీ నిర్ణయం.. అదానీ పవర్ కు అడ్డెవడు..! మ్యాటర్ ఏంటంటే..
Coal Import: కరోనా తర్వాత దేశంలో ఉత్పత్తి రంగం ఒక్కసారిగా ఊపందుకుంది. దీనికి తోడు గృహ, వ్యాపార వినియోగదారులు సైతం విద్యుత్ వినియోగాన్ని పెంచటంతో డిమాండ్ భారీగా పెరిగింది. దీని కోసం దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి.
కోల్ ఇంపోర్ట్..
రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు, నిరంతరం ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్ సరఫరా చేసేందుకు పవర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దీనికోసం భారీగా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఈ పరిస్థితులలో విద్యుత్ డిమాండ్ను సరఫరా చేయడానికి పూర్తిగా పరిహారం చెల్లించాలని విద్యుత్ నియంత్రణ సంస్థ మంగళవారం తెలిపింది.
కంపెనీలకు అనుకూలంగా..
దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్ల కోసం విద్యుత్ టారిఫ్లు వాటి ఖర్చులతో పాటు "సహేతుకమైన లాభ మార్జిన్ను" కవర్ చేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(CERC) జనవరి 3న విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. గత ఏడాది విద్యుత్ సంక్షోభం సమయంలో ప్రైవేటు విద్యుత్ సంస్థ టాటా పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన టారిఫ్కు వ్యతిరేకంగా CERCని సంప్రదించిన తరుణంలో ఈ వార్త వెలువడింది.
అదానీకి లాభమేంటి..
ఇటీవల కాలంలో అదానీ ప్రభుత్వానికి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు నష్టాల కారణంగా మూతపడిన పవర్ ప్లాంట్లను కొనుగోలు చేయటంపై చాలా దూకుడుగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకాశాన్ని సైతం ఆయన వదులుకోవటం లేదు. కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల అదానీ కంపెనీ భారీగా లాభపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయానికి ముందు SKS పవర్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు అదానీ, అంబానీ పోటీపడటం వార్తల్లో ప్రధానాంశంగా మారింది.