ఆకాశవీధిలో టాటాల ఆధిపత్యం: ఎయిరిండియా ఖాతాలో మరో ఎయిర్లైన్స్
న్యూఢిల్లీ: ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా చేతికి మరో ఎయిర్లైన్స్ వచ్చి చేరింది. ఎయిర్ ఆసియా ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి ఎయిరిండియాకు అనుమతి లభించింది. నిజానికి- ఎయిర్ ఆసియా ఇండియా.. టాటా సన్స్ గ్రూప్కు చెందినదే. దాని సబ్సిడియరీగా ఉంటోంది ఎయిర్ ఆసియా ఇండియా.
దీన్ని పూర్తిస్థాయిలో ఎయిరిండియాలో విలీనం చేసుకోవడానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి కిందటే టాటా సన్స్.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఎయిర్ ఆసియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఈక్విటీ షేర్స్ కేపిటల్ మొత్తాన్నీ వందశాతం మేర స్వాధీనం చేసుకోవడానికి ఎయిరిండియా లిమిటెడ్కు అనుమతి లభించినట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఎయిర్ ఆసియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 83.67 శాతం మేర ఈక్విటీ షేర్లు ఉన్నాయి. మిగిలిన వాటాలను కూడా కొనుగోలు చేయడానికి సీసీఐ నుంచి అనుమతిని తీసుకుంది. ప్రస్తుతం ఎయిరిండియా-ఎయిర్ ఆసియా ఇండియాలకు డొమెస్టిక్ ప్యాసింజర్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 15.7 శాతం మేర మార్కెట్ ఉంది.
ఎయిరిండియాకే చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్లో సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాలేదు. గల్ఫ్ రూట్లో మాత్రమే ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ముందే అంటే 2020 డిసెంబర్లోనే టాటా సన్స్.. ఎయిర్ ఆసియా ఇండియాలో పెట్టుబడులు పెట్టింది. 83.67 శాతం వాటాలను కొనుగోలు చేసింది.
దీనితో మొత్తం నాలుగు విమానయాన సంస్థలకు టాటా సన్స్ ఆధిపతిగా నిలిచినట్టయింది. ఆకాశవీధిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టయింది. ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలకు టాటా సన్స్ ఆధీనంలో ఉన్నాయి. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఫర్మ్- ఎయిరిండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ గ్రూప్స్కు చెందినదే.