మరో ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం- తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో తన వాటాలను విక్రయించనుంది. వాటిని ప్రైవేటీకరించనుంది. ఈ సంవత్సరం ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా కనీసం 70,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా, జీవిత బీమా సంస్థల్లో తన పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి తన వాటాలను విక్రయించుకోవడానికి ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఇదివరకే స్టార్9 మొబిలిటీ బిడ్డింగ్కు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ఆమోదం తెలిపినప్పటికీ.. దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వార్తలు వస్తోన్నాయి.
జూన్లో మళ్లీ దీనికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే హిందుస్తాన్ జింక్ కంపెనీలో పెట్టుబడులను ఉపసంహించుకోనుంది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర కేబినెట్ కమిటీ (కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్) ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం ఈ కమిటీ సమావేశమైంది. హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో ఉన్న తన వాటాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపినట్లు బిజినెస్ పోర్టల్స్ వెల్లడించాయి.
హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 29.54 శాతం. దీని విలువ సుమారు 38,560 కోట్ల రూపాయలు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా వేదాంత స్టెరిలైట్ ఇండస్ట్రీస్కు ఉంది. కాగా తన వాటాను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించాలని తీర్మానించినట్లు సమాచారం. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం హిందుస్తాన్ జింక్లో 26 శాతం వాటాలను వేదాంతకు విక్రయించింది. ఆ మరుసటి సంవత్సరమే అనిల్ అగర్వాల్కు మరో 19 శాతం వాటాలను అమ్మేసింది. తాజాగా 29.54 శాతం వాటాలను కూడా పూర్తిగా విక్రయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.