డిసెంబర్ 31 వరకు... జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పెంపు
కరోనా మహమ్మారి ఇబ్బందికర పరిస్థితుల్లో జీఎస్టీ చెలలిపుదారులకు ప్రభుత్వం భారీ ఊరటను ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్న్స్ ఫైలింగ్ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్(CBIC) శనివారం తెలిపింది. వైరస్ కారణంగా ఇబ్బందులు పడకుండా మొదటిసారి నెలరోజులు పొడిగించిన గడువును, ఇప్పుడు మరో రెండు నెలలు పొడిగించింది.
రూ.2 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్టీ వార్షిక రిటర్న్(GSTR 9, GSTR 9C)ను ఫైల్ చేయవలసి ఉంటుంది. రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు మాత్రమే రీక్యాన్సిలేషన్ స్టేట్మెంట్(GSTR 9C)ని సమర్పించవలసి ఉంటుంది.
ట్యాక్స్పేయర్స్కు ఊరట, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 2019-20(అసెస్మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కు ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని ఆర్థికమంత్రిత్వశాఖ పొడిగించడం ఇది రెండోసారి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ మే నెలలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పొడిగించారు.