పీఎన్బీలో మళ్లీ మరో స్కామ్.. మారుతి మాజీ ఎండీపై సీబీఐ కేసు!
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో మళ్లీ మరో స్కాం వెలుగు చూసింది. ఈసారి కుంభకోణం విలువ రూ.110 కోట్లు. ఇందులో మారుతి ఉద్యోగ్ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ ఇరుక్కున్నారు. ఈ మేరకు ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగదీష్ ఖట్టర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్లో 1993 నుంచి కొనసాగారు. 2007లో మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత ఆయన కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. 2009లో ఈ కంపెనీ కోసం ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.170 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి 2012 వరకు కొంత మొత్తం చెల్లించారు కానీ ఇంకా రూ.110 కోట్లు బ్యాంక్కు చెల్లించాల్సి ఉంది.
దీంతో 2015లో ఈ మొత్తాన్ని పీఎన్బీ నిరర్ధక ఆస్తి(ఎన్పీఏ)గా ప్రకటించింది. ఈ రుణ వ్యవహారంలో కార్నేషన్ కంపెనీకి మరో మూడు కంపెనీలు హామీ ఇచ్చాయి. అవి - ఖట్టర్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కార్నేషన్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, కార్నేషన్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇవేకాక మరో ఐదుగురు వ్యక్తులకు కూడా ఈ రుణ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు పీఎన్బీ తన ఫిర్యాదులో పేర్కొంది.
తమ బ్యాంకులో రుణం తీసుకుని రూ.110 కోట్లు చెల్లించకుండా ఎగవేశారంటూ జగదీష్ ఖట్టర్, ఆయన కంపెనీ కార్నేషన్లపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకునేటప్పుడు కార్నేషన్, జగదీష్ ఖట్టర్.. తనఖాగా పెట్టిన ఆస్తులను ఆ తరువాత అనధికారికంగా, అనుమతి లేకుండానే అమ్మేసినట్లు, ఆ నిధులను ఆయన దారి మళ్లించినట్లు సీబీఐ గ్రహించింది.
ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసాలకు పాల్పడినందుకు జగదీష్ ఖట్టర్పై కేసు నమోదు చేసిన సీబీఐ మంగళవారం ఆయన్ని తన అదుపులోకి తీసుకుంది. ఖట్టర్, ఆయన కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా లిమిటెడ్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.110 కోట్లు ఎగవేసి నష్టం కలిగించారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అయితే ఈ కుంభకోణంలో ఇతర వ్యక్తుల పాత్ర ఏమేరకు ఉందనేది.. విచారణ తరువాతే వెల్లడవుతుందని సీబీఐ వ్యాఖ్యానించింది.