Tax: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. దీనిపై పన్ను మినహాయింపు భారీగా పెంచిన CBDT
Tax: కేంద్రంలోని BJP ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పలు మార్పులు చేసింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితి దగ్గర నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వరకు వివిధ కొత్త పద్ధతులు అమల్లోకి వచ్చాయి. ప్రైవేటు ఉద్యోగుల లీవ్ఎన్క్యాష్మెంట్ విషయంలోనూ పన్ను మినహాయింపుపై మంచి నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా.. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. పదవీ విరమణ తర్వాత లీవ్ ఎన్క్యాష్మెంట్ కోసం పన్ను మినహాయింపు పరిమితిని 25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ మినహాయింపు కేవలం 3 లక్షలు మాత్రమే ఉంది. అయితే దీనిని 2002లో నిర్ణయించగా, అప్పటికి ప్రభుత్వ ఉద్యోగుల అత్యధిక మూలవేతనం నెలకు 30 వేలు కావడం గమనార్హం.
సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించబడిన మొత్తం 25 లక్షల పరిమితిని మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ కంపెనీల నుంచి ఇటువంటి చెల్లింపులు స్వీకరిస్తున్న ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.
"2023 బడ్జెట్ ప్రసంగంలోని ప్రతిపాదనకు అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వం 01.04.2023 నుంచి 25 లక్షల వరకు పదవీ విరమణ లేదా ప్రభుత్వేతర జీతం పొందే ఉద్యోగుల సెలవు ఎన్క్యాష్మెంట్పై పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది" అని CBDT తెలిపింది. ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. దానిని ఇప్పుడు CBDT అమల్లోకి తీసుకొచ్చింది.