గుడ్ న్యూస్: ‘క్యాప్జెమిని’లో 15 వేల మంది ఫ్రెషర్లకు జాబ్స్!
ఐటీ రంగంలోకి ఎంటరవ్వాలనే వారికి, అందులోనూ ఫ్రెషర్లకు ఒక గుడ్ న్యూస్. ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని ఈ ఏడాది 12 వేల నుంచి 15 వేల మంది ఫ్రెషర్లకు జాబ్స్ ఇవ్వబోతోందట. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా వీరిని నియమించుకోనుంది.
ప్రస్తుతం క్యాప్జెమినికి మన దేశంలో 1.2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఐటీ దిగ్గజానికి చెందిన మొత్తం ఉద్యోగుల్లో సగం మంది మన దేశంలోని దాని కార్యాలయాలలో పని చేస్తుండడం, గత ఏడాది కూడా క్యాప్జెమిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఇదే స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకోవడం గమనార్హం.
ప్రస్తుతం నియమించుకోనున్న ఫ్రెషర్లకు రూ.3.8 లక్షల సగటు వార్షిక ప్యాకేజీని క్యాప్జెమిని ఆఫర్ చేయబోతోంది. ఇక ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకైతే ఇది మరింత అధికంగా.. రూ.6.5 లక్షల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్యాప్జెమిని ప్రస్తుతం 5జీ సాంకేతికతపై ఫోకస్ పెట్టినట్లు ఆ సంస్థ ఇండియా సీఈవో అశ్విన్ యార్డీ తెలిపారు. దీని కోసం అటు ప్యారిస్.. ఇటు ముంబైలో రెండు ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో క్యాప్జెమినికి ఇప్పటివరకు 200 మంది వైస్ ప్రెసిడెంట్లు, 26 మంది గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(జీఈసీ)లు ఉన్నారు. అంతేకాకుండా, తాజాగా తన 5జీ, కమ్యునికేషన్ బిజినెస్ను నడిపించడం కోసం ఎయిర్టెల్ వైస్ ప్రెసిడెంట్ మోనికా గుప్తాను ఈ సంస్థ ఇటీవల కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా నియమించుకుంది.
మరోవైపు అమెరికాకు చెందిన మరో ఐటీ దిగ్గజం.. కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది 20 వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. వీరికి సగటున రూ.4 లక్షల వార్షిక ప్యాకేజీని అందించనుంది.
ఇలా దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలకు తెరతీయనుండడంతో ఐటీ రంగంలోకి రావాలని భావిస్తోన్న కాలేజీ విద్యార్థులకు, ఫ్రెషర్లకు పండగే!