Year Ender 2019: మోడీ కల నిజమైతే... ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు?
దశాబ్దాలుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటున్నాం. కానీ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు ఎదుగుతుందనేది చాలామంది ప్రశ్న. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక మార్కెట్లకు కొత్త ఊపు వచ్చింది. దేశంలోని చాలామంది కూడా బీజేపీ ప్రభుత్వం ముందుచూపుతో సాగుతుందని అంచనా వేశారు. అందుకు తగినట్లే మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన అయిదేళ్ల పాటు వృద్ధి రేటు పుంజుకుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ తగ్గుతూ వస్తోంది.
క్రికెట్ ప్రపంచకప్, చంద్రయాన్, ఆర్టికల్ 370, పీఎం కిసాన్: 2019 గూగుల్ టాప్ 10 ఇవే
మందగించిన వృద్ధి
గతంలో పరుగులు పెట్టిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించింది. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం, చైనా - అమెరికా ట్రేడ్ వార్ వంటి ఎన్నో అంశాలు కారణం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మార్కెట్లు రికార్డ్ స్థాయికి దూసుకెళ్లాయి. కొద్ది రోజుల క్రితం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అదే సమయంలో మార్కెట్లు భారీగా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు మందగమన ప్రభావం కారణం.
ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితులు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ట్రేడ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. వివిధ కారణాల వల్ల భారత్లో భారత్లో వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్ని నెలల క్రితం 2 దశాబ్దాల కనిష్టానికి సేల్స్ పడిపోయాయి. ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా తిరోగమనంలో కనిపించాయి. దీంతో వేలాది ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.
తగ్గుతున్న జీడీపీ
మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ తొలి క్వార్టర్లో 5 శాతానికి, రెండో క్వార్టర్కు 4.5 శాతానికి పడిపోయింది. రేటింగ్ ఏజెన్సీలు ఆయా క్వార్టర్స్ లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వేస్తున్న అంచనాను అంతకంతకు తగ్గిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక మందగమనానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ట్రేడ్ వార్ వంటి అంశాలతో పాటు జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం కూడా ఇంకా కొంత ఉందని చెబుతున్నారు. మరోవైపు, ఆహార ద్రవ్యోల్భణం, పారిశ్రామిక వృద్ధి కూడా ఆందోళన కలిగిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినిమయ డిమాండ్ తగ్గింది.
ఉద్దీపనలతో ప్రయోజనం
అయితే మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. ఆయా రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. కేంద్రం ఉద్దీపన చర్యలతో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆయా రంగాలకు ఇవి ప్రయోజనకరంగా మారుతాయని భావిస్తున్నారు. కంపెనీలకు ఊతమివ్వడంతో పాటు వినిమయం తగ్గడంతో వాటికి అనుగుణంగా కూడా కేంద్రం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను నుంచి మొదలు పీఎఫ్ - వేతనం వరకు పలు మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
భారత్ కాస్త మెరుగు
ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల కేవలం మన దేశంలోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు పోతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో దేశాల కంటే భారత్ పరిస్థితి కాస్త మెరుగు అని చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం ఆటోరంగానికి ఉద్దీపనలు ప్రకటించిన అనంతరం కాస్త పాజిటివ్గా కనిపిస్తోంది. గత క్వార్టర్లో చైనాలో వాహనాల సేల్స్ ఏకంగా 18 నెలల కనిష్టానికి పడిపోయాయి.
మోడీ ప్రభుత్వం అది సాధిస్తే...
2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించినప్పటికీ, కేంద్రం తీసుకున్న లేదా తీసుకుంటున్న చర్యలతో ఆ మరుసటి ఏడాది వృద్ది రేటు పుంజుకుంటుందని రేటింగ్ ఏజెన్సీలు అంటున్నాయి. ఇది సానుకూల పరిణామంగా చెబుతున్నారు. అలాగే, భారత్ను 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలని మోడీ ప్రభుత్వం కలలు కంటోంది. దానికి జీడీపీ 8 నుంచి 9 శాతంగా ఇప్పటి నుంచే ఉండాలి. ఇది సాధ్యం కాకపోవచ్చునని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతుండగా, సాధ్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ మోడీ ప్రభుత్వం 2024 నాటికి ఆ టార్గెట్ రీచ్ అయితే ఆ తర్వాత కొన్నేళ్లలోనే భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడవచ్చునని అంటున్నారు. ఇప్పటికే భారత్, చైనాలు ఇంకా ఎన్నాళ్లు అభివృద్ధి చెందిన దేశాలుగా చెబుతాయని టారిఫ్ అంశంలో అమెరికా నిలదీస్తోంది.
అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు?
భారత్ మరో పదేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని గత ఏడాది ఎస్బీఐ స్టడీ వెల్లడించింది. పదేళ్ల విషయం పక్కన పెడితే, అలాగే మందగమనం కంటే ముందు అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఇటీవలి కాలంలో భారత్ నిలిచింది. 2050 నాటికి భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి, అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని కొన్ని నివేదికలు అభిప్రాయపడ్డాయి.