పరిహారం ఇప్పించండి: భారత్పై అమెరికా కోర్టులో కెయిర్న్ కేసు
హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుండి 1.2 బిలియన్ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్ అమెరికాలోని ఓ కోర్టులో కేసు దాఖలు చేసింది. భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని డిసెంబర్ నెలలో ఆర్బిట్రేషన్ కోర్టులో కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ధ్రువీకరించాలని అమెరికాలో డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది కెయిర్న్.
భారత్ నుండి జరిమానా వసూలు చేసేందుకు కెయిర్న్ ఎనర్జీ ప్లాన్డ్గా సాగుతోంది. భారత్ ఈ సొమ్మును చెల్లించని పక్షంలో అమెరికాలోని భారత ఆస్తులను సీజ్ చేసి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కేసును కెయిర్న్ గెలిస్తే అమెరికా సహా విదేశాల్లోని భారత్ ఆస్తులను సీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను గత నెలలో కెయిర్న్ ఎనర్జీ గుర్తించింది. వీటిలో బ్యాంకు ఖాతాలు, ఎయిరిండియా విమానాలు, భారతీయ నౌకలు ఉన్నాయి.
యుకే, నెదర్లాండ్స్ కోర్టుల్లోను ఇలాంటి పిటిషన్లను దాఖలు చేసింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుకు లోబడి తమకు పరిహారం చెల్లించాలని లేదంటే విదేశాల్లోని భారత బ్యాంకు ఖాతాలు, విమానాలు, నౌకలు తదితర ఆస్తులు జఫ్తు చేసుకొని వసూలు చేసుకుంటామని భారత్ను బ్రిటన్ సంస్థ అయిన కెయిర్న్ గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే.