మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్తో టిక్టాక్ చర్చలు
భారత్లో చైనీస్ కంపెనీ బైట్డ్యాన్స్కు చెందిన టిక్టాక్, హెలో సహా పలు యాప్స్ను భారత్ నిషేధించింది. ఇదే బాటలో అమెరికా సహా వివిధ దేశాలు నడిచే పరిస్థితులు ఉన్నాయి. స్వల్పకాలంలో ఎక్కువమంది యూజర్ డేటాను, ఎక్కువ డౌన్లోడ్స్ను నమోదు చేసిన టిక్టాక్ ఇప్పుడు భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో వ్యాపరపరంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో ఆయా దేశాల్లోని కంపెనీలకు వాటాలు విక్రయించేందుకు సిద్ధమైంది బైట్ డ్యాన్స్. ఇప్పటికే అమెరికా, కెనడా సహా వివిధ దేశాల్లోని టిక్టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరిచింది. ఇండియా కార్యకలాపాలపై కూడా చర్చలు సాగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త వెలుగు చూసింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్తో బైట్ డ్యాన్స్ చర్చలు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నియామకాలు నిలిపివేసిన టిక్టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నం
రిలయన్స్తో టిక్టాక్ చర్చలు
ఈ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ భారత్లో పునరాగమనం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో తన యూజర్ బేస్ను కాపాడుకునేందుకు ఎంతగానే తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా ఓ వైపు ప్రభుత్వంతో భద్రతా నిబంధనల గురించి చర్చిస్తూనే, మరోవైపు వాటా విక్రయం కోసం వివిధ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. ఇందులో భాగంగా భారత్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు టిక్ టాక్ మాతృసంస్థ చర్చలు జరుపుతోందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
గత నెలలోనే చర్చలు ప్రారంభం
జూలైలోనే బైట్ డ్యాన్స్, రిలయన్స్ మధ్య చర్చలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రిలయన్స్, బైట్ డ్యాన్స్ స్పందించాల్సి ఉంది. అమెరికాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైట్ డ్యాన్స్... మైక్రోసాఫ్ట్తో చర్చలు జరుపుతోంది. డొనాల్డ్ ట్రంప్ వీరికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత నిషేధిస్తామని హెచ్చరించారు. ట్విట్టర్ కూడా టిక్టాక్ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది.
అదే జరిగితే..
మన దేశంలో టిక్టాక్ బిజినెస్ 3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. రిలయన్స్-బైట్ డ్యాన్స్ ఒప్పందంపై క్లారిటీ లేనప్పటికీ.. ఆయిల్ నుండి రిటైల్ వరకు అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ నేతృత్వంలోని రిలయన్స్ ఇందులో వాటాలు కొనుగోలు చేస్తే మరో కొత్త రంగంలోకి అడుగిడినట్లు అవుతుంది. ఇండియా కార్యకలాపాలు కూడా కొనుగోలుచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో రిలయన్స్తో చర్చలు జరగడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కూడా టిక్టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తూనే.. ఇతర సంస్థలతో కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తి కనబరుస్తోంది. మరోవైపు, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఓ విధంగా సోషల్ మీడియాలో దీనికి టిక్టాక్ పోటీ అని చెప్పవచ్చు. బిజినెస్పరంగా ఈ రెండింటికి సంబంధం లేదు.