చైనా పరికరాలకు చెక్, టెలికంపై ప్రభుత్వం కీలక నిర్ణయం: జాబితా నుండే..
టెలికం పరికరాల దిగుమతులకు సంబంధించి కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. చైనా నుండి దిగుమతి టెలికం సామాగ్రికి అడ్డుకట్ట వేసేలా తాజా నిబంధనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నమ్మకమైన వర్గాల(ట్రస్టెడ్ సోర్సెస్) నుండి మాత్రమే దేశంలోని నెట్ వర్క్ సంస్థలు తమకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికమ్యూనికేషన్ సెక్టార్(NSDTS)ని రూపొందించింది. ఈ ప్రత్యేక విధానానికి ఆమోదం లభించింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది, 15 రోజుల్లో రెండోసారి
హువావే వంటి చైనా కంపెనీలకు చెక్ పెట్టేలా
ఈ కొత్త పాలసీ కింద కంపెనీలు దేశ భద్రతకు ప్రమాదంలేని విశ్వసనీయ కలిగిన కంపెనీల నుండి మాత్రమే టెలికం పరికరాలు దిగుమతి చేసుకోవాలి. అలాంటి కంపెనీల జాబితాను, వాటి నుంచి దిగుమతి చేసుకోదగిన పరికరాల జాబితాను ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. భారత జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని టెలికం రంగానికి సంబంధించిన జాతీయ భద్రత నిబంధనలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. హువావే వంటి చైనా కంపెనీల టెలికం పరికరాల దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానం తీసుకువచ్చినట్లుగా భావిస్తున్నారు.
వీరు సభ్యులుగా..
కేంద్ర కేబినెట్ ఆమోదించిన నిబంధనల ప్రకారం నమ్మకమైన విక్రేతలు, పరికరాల జాబితాను డాట్ ప్రకటించనుంది. 'డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ నమ్మకమైన వర్గాలు అలాగే ఉత్పత్తుల జాబితాను రూపొందిస్తుంది. ఆయా సంస్థలు, పరికరాలను మాత్రమే ఇకపై దేశీ టెల్కోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టెలికం రంగంలో జాతీయ భద్రత కమిటీగా వ్యవహరించే ఈ బృందంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన సభ్యులు, టెలికం పరిశ్రమ, స్వతంత్ర నిపుణుల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటార'ని రవిశంకర ప్రసాద్ తెలిపారు.
వాటికి వర్తించదు
టెలికం కంపెనీలు తమ కొత్త సామాగ్రిని జాబితాలో ఉన్న నిర్దిష్ట విశ్వసనీయ ఉత్పత్తుల నుండే ఎంచుకోవాలి. అయితే ఇప్పటికే వినియోగిస్తున్న పరికరాలకు తాజా నిబంధన వర్తించదని రవిశంకర ప్రసాద్ స్పష్టం చేశారు. వాటిని మార్చాల్సిన అవసరం లేదన్నారు. కాగా గత నెలలో టెలికం, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించిన సామాగ్రిని చైనా నుండి దిగుమతి చేసుకోకుండా భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.