ముందే ఒప్పందం: ఎయిరిండియా, బీపీసీఎల్ ఉద్యోగులకు హామీ
ప్రభుత్వరంగ ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL)ను కొనుగోలు చేసే సంస్థలు అందులో పని చేస్తోన్న ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించకుండా చర్యలు తీసుకుంటామని DIPAM సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు. ఈ మేరకు వాటా విక్రయ ఒప్పందంలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయివేటు రంగ సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ సంస్థల్లో సాధారణంగానే ఎక్కువమంది ఉద్యోగులు పని చేస్తుంటారన్నారు.
భారత్ ఆటోషోకు కరోనా వైరస్ దెబ్బ, చైనీయుల పర్యటన రద్దు?
ఉద్యోగులను తొలగించకుండా ఒప్పందం
ఎయిరిండియా, బీపీసీఎల్లను కొనుగోలు చేసే ప్రయివేటు సంస్థలు ఏ కారణంతో కూడా ఉద్యోగులను తొలగించకుండా ముందే ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. ఈ మేరకు షరతులు విధిస్తామన్నారు. ఎయిరిండియాకు బిడ్లను మార్చి 17వ తేదీ కల్లా ఆహ్వానిస్తామన్నారు. బీపీసీఎల్కు కొంత సమయం పడుతుందన్నారు.
BPCL ప్రయివేటీకరణపై ఆందోళన
ఇదిలా ఉండగా, BPCL ప్రయివేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దాదాపు రూ.9 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన బీపీసీఎల్ను చౌకగా ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల అధికారుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.
రూ.9 లక్షల కోట్ల వ్యాల్యూ...
BPCL కంపెనీ షేర్ల ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 53.19% వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు చేసే ప్రయివేటు కంపెనీ ఓపెన్ మార్కెట్ నుంచి మరో 26% షేర్లను కొనుగోలు చేయాలి. మొత్తం వాటా కొనుగోలుకు ప్రయివేటు కంపెనీకి రూ.80,000-రూ.90,000 కోట్లు అవసరం. రూ.9 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన BPCLకు ఇది చాలా తక్కువ ధర అని చెబుతున్నారు.
పాలసీదారులకు హామీ
ఎల్ఐసీ పాలసీదారుల ప్రయోజనాలు కాపాడుతామని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో నమోదు చేశాక మరింత పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, ఈక్విటీ మార్కెట్ను బలోపేతం చేస్తామన్నారు. ఎల్ఐసీ చట్టంలో సవరణలు చేసిన తర్వాత ఎంత వాటా విక్రయించాలో నిర్ణయిస్తామన్నారు.