Monthly GST returns: నెల ఆపేసినా జీఎస్టీఆర్ 1 దాఖలు చేయలేరు!
వ్యాపారులకు జీఎస్టీఆర్ అలర్ట్. జీఎస్టీ వివరాలు సమర్పించే జీఎస్టీఆర్-3B రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపినా ఆ తదుపరి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్స్ను దాఖలు చేసే వీలు ఉండదు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీఎస్టీఆర్-3Bని 2 నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్టీఆర్-1ను సమర్పించడానికి వీలులేదు. వచ్చే ఏడాది నుండి దీనిని ఒక నెలకు తగ్గిస్తున్నారు. ఇందుకు కేంద్ర జీఎస్టీ నిబంధనల్లోని 59(6)ను సవరణ చేస్తున్నారు. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్టీఆర్-1ను మరుసటి నెల 11వ తేదీ వరకు వ్యాపారులు దాఖలు చేస్తారు. జీఎస్టీ వివరాలతో జీఎస్టీఆర్-3Bని మరుసటి నెల 20 రోజుల నుండి 24 రోజుల మధ్య సమర్పించి, జీఎస్టీని చెల్లిస్తారు.
మరోవైపు, జీఎస్టీ రిఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, క్యాన్సిల్ చేసుకున్న రిజిస్ట్రేషన్ను పునరుద్దరించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు ధృవీకరణను కౌన్సిల్ తప్పనిసరి చేసింది. 2020 ఆగస్ట్ 21వ తేదీన కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్(CBIC) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ధృవీకరణను వ్యాపారులు ఇవ్వకపోతే, వ్యాపారం జరిగే ప్రాంతాన్ని భౌతికంగా చూసి, నిర్దారించుకున్న తర్వాత రిజిష్టర్ చేస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్తో ఆధార్ను తప్పనిసరిగా లింక్ చేసే నిబంధనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్తో లింక్ అయిన పాన్ నెంబర్ కలిగిన బ్యాంక్ ఖాతాలోనే జీఎస్టీ రిఫండ్స్ వేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.
జీఎస్టీ 45వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పలు అంశాలపై సుదీర్ఘకంగా చర్చించిన అనంతరం, పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ నెలాఖరుతో ముగిసే కరోనా మెడిసిన్స్ పైన జీఎస్టీ రాయితీని డిసెంబర్ చివరి వరకు కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది.