Budget 2022: పన్ను రేట్ల కోతలు ఉండకపోవచ్చు, ఉద్యోగాలు చాలా కీలకం
ప్రస్తుత కరోనా పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వాలని, ఇదే తొలి ప్రాధాన్యత కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థలు అసమానతలను తగ్గించేదిగా ఉండాలని కోరుకున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారావు మాట్లాడారు.
బడ్జెట్లో ఇవి...
నిర్మలమ్మ తన తదుపరి బడ్జెట్లో ఉద్యోగాల సృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సుబ్బారావు ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవాలని, ఆర్థిక అసమానతల తొలగింపుకు చర్యలు ఉండాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు పెంచాలన్నారు. ఈసారి బడ్జెట్లో రేట్ల కోత ఎక్కువగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి బడ్జెట్కు వృద్ధిని పెంచడమే లక్ష్యమని, కానీ ఈసారి ఆర్థిక అసమానతలను తగ్గించే దృష్టి సారించాలన్నారు.
ఉపాధితో కూడిన వృద్ధి
కరోనా తీవ్రత దిగువస్థాయి వర్గాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. అధిక ఆదాయ వర్గాలు వారి ఆదాయాన్ని కాపాడుకోవడంతో పాటు సంపదను, పొదుపును పెంచుకున్నాయని, తాజా ప్రపంచ అసమానత్వ నివేదిక ప్రకారం మన దేశంలోను అధిక అసమానతలు కనిపించాయన్నారు. ఆర్థిక అసమానతలతో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు ఉపాధితో కూడిన వృద్ధి కావాలని, బడ్జెట్కు థీమ్ ఏదైనా ఉంటే అది ఉపాధి కల్పన కావాలన్నారు.
పన్నులు రేటు తగ్గించే అవకాశం లేదు
విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచవలసి ఉందని, అందుకే పన్నులు తగ్గించే అవకాశం లేదన్నారు సుబ్బారావు. నిర్వహణపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచాలన్నారు. అప్పుడే పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. గత బడ్జెట్ లక్ష్యం కంటే వసూళ్లు పెరిగినట్లుగా తెలుస్తోందని, కానీ పెట్టుబడుల ఉపసంహరణ తగ్గుదల, ఆహారం, ఎరువుల సబ్సిడీ వ్యయాలు పెరగడంతో ద్రవ్యలోటు తగ్గడం లేదన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.5 శాతానికి తగ్గించుకోవాలన్నారు.