Budget expectation: స్టాండర్డ్ డిడక్షన్ హైక్, పిల్ల చదువులకు ట్యాక్స్ రిలీఫ్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారు. ఈ బడ్జెట్ పైన ఎంతోమంది ఎన్నో ఆశలతో ఉన్నారు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో రద్దు చేసిన ఉద్యోగుల స్టాండర్డ్ డిడక్షన్ను మోడీ ప్రభుత్వం 2018-19లో తీసుకు వస్తూ ఊరటను కల్పించింది. అప్పుడు రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించింది. ఆ తర్వాత 2019-20లో దీనిని రూ.50,000కు పెంచారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపును రూ.1 లక్షకు పెంచాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్టాండర్డ్ డిడక్షన్ ఊరట
కరోనా కారణంగా ఉద్యోగుల నుండి అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్రవ్యోల్భణం పెరిగింది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులు పెరిగాయి. హౌస్ హోల్డ్ ఖర్చులు కూడా పెరిగాయి. దీనికి తోడు ఉద్యోగుల మెడికల్ ఖర్చులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఫర్నీచల్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ వంటి ఖర్చులు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ను రూ.50,000 నుండి రూ.75,000కు పెంచాలనే విజ్ఞప్తులు వచ్చాయి. బడ్జెట్లో నిర్మలమ్మ ఇందుకు సంబంధించి ఊరటను కల్పించవచ్చునని భావిస్తున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఐర్లాండ్ సహా వివిధ దేశాల్లో వైద్య ఖర్చులపై, హోమ్ ఆఫీస్ సెటప్ కోసం సహా ఇంటి నుండి పని చేసే ఖర్చులపై నిర్దిష్ట పన్ను మినహాయింపులు ప్రకటించాయి.
పిల్లల చదువుల కోసం
పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు అనేది ముఖ్యమైన ఆర్థిక సాధనం. ఆదాయంలో కొంత భాగాన్ని సాధారణంగా ఇలాంటి పొదుపు కోసం కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇందులో ఈపీఎఫ్, పీఎఫ్, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటివి ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా పిల్లల చదువుల కోసం రూ.1.5 లక్షల పరిమితి డిడక్షన్ ఉండాలని అంటున్నారు.
మరికొద్ది రోజుల్లో బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించడానికి ముందు వివిధ వర్గాలు, ఆర్థికవేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. బడ్జెట్ తయారీ అనంతరం దీనిని వచ్చే నెల మొదటి తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారు.