Budget 2022: సీఈఓ గైర్హాజరీలో ఎకనమిక్ సర్వే, జీడీపీ వృద్ధి రేటు 9%
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఓవైపు కరోనా నుండి కోలుకుంటున్న పరిస్థితులు, ఇంకోవైపు ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశపెడుతున్న 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ పైన వివిధ రంగాలు, ఉద్యోగులు, అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9 శాతంగా నమోదయ్యే అవకాశముందని 2021-22 ఆర్థిక సర్వేలో అంచనా వేయనున్నారు.
ఈసారి ఆర్థికసర్వేను ఒకే పుస్తకంగా తీసుకు వస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆర్థికమంత్రి సర్వేను విడుదల చేస్తారు. ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) గైర్హాజరీలో ప్రధాన ఆర్థిక సలహాదారు, ఇతర అధికారులు ఈ సర్వేను రూపొందిస్తున్నారు.
ఎన్ఎస్ఓ ముందస్తు అంచనాల ప్రకారం 2021-2022లో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదయ్యే అవకాశముంది. రిజర్వ్ బ్యాంక్ 9.5 శాతం వృద్ధి రేటు అంచనా కంటే ఇది తక్కువ. బేస్ ఎఫెక్ట్ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదు కావొచ్చునని సర్వే అంచనా వేస్తోంది. గత ఏడాది జనవరిలో విడుదలైన 2020-21 ఆర్థిక సర్వేలో 2021-22లో 11 శాతం వృద్ధి రేటును అంచనా వేశారు.
ఎకనమిక్ సర్వే తయారీలో సీఈఓ కీలకంగా వ్యవహరిస్తారు. అయితే 2014లో మొదటిసారి అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ ఇల పట్నాయక్, ఇతర సీనియర్ అధికారులు రూపొందించారు. గత ఏడాది డిసెంబర్ 6న కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోగా, కొత్త సీఈవోను నియమించే పనిని ప్రభుత్వం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో మళ్లీ సీఈఓ గైర్హాజరీలో ఎకనమిక్ సర్వేను రూపొందిస్తున్నారు.