Budget 2022: ప్రైవేటీకరణపై మరింత దూకుడు: భారత్ పెట్రోలియం సహా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇవి కీలకమైన సమావేశాలు. పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్లో మోడీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది తేలిపోనుంది.
రెండు విడతల్లో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీన ఆరంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు విడతల్లో పార్లమెంట్ ఉభయ సభలు భేటీ అవుతాయి. తొలిదశ సమావేశాలు 31వ తేదీన మొదలవుతాయి. ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తాయి. మళ్లీ మార్చి 14వ తేదీన లోక్సభ, రాజ్యసభ మలి విడతలో భేటీ అవుతాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తాయని సమాచారం. పూర్తి కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది మోడీ సర్కార్.
ఫిబ్రవరి 1న బడ్జెట్..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఉభయ సభలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020, 2021 తరహాలోనే ఈ దఫా కూడా బడ్జెట్ సమావేశాలు కోవిడ్ ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి. వరుసగా రెండు కరోనా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని భర్తీ చేసుకోవడానికి అనేక మార్గాలను ఎంచుకుంది.
పెట్టుబడుల ఉపసంహరణ మరింత వేగవంతం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను ఉపసంహరించుకోబోయే మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థల పేర్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా విక్రయించి తీరదలిచిన కంపెనీల పేర్లను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చడమో లేక.. ఆ ప్రక్రియను ముమ్మరం చేస్తుందని అభిప్రాయపడుతున్నాయి. 2023 ఎన్నికల సంవత్సరం అవుతుందని, అందుకే ప్రైవేటీకరణను 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే వేగవంతం చేస్తుందని తెలుస్తోంది.
ఉత్కంఠతగా బడ్జెట్ ప్రతిపాదనలు..
ఈ బడ్జెట్లోనూ అవే తరహాలో కొత్త ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ప్రభుత్వం ఇంకెలాంటి సంచలన అంశాలను పొందుపరుస్తుందనేది ఉత్కంఠతను రేపుతోంది. కాగా- ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, రెండు లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకోవడం వంటి ప్రతిపాదనలను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎల్ఐసీ ఐపీఓ మీదే..
మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ సంభవించలేదు. ఒక్క ఎయిరిండియాను మాత్రమే మోడీ సర్కార్- విక్రయించుకోగలిగింది. దాని మాతృసంస్థ టాటా సన్స్కు ఎయిరిండియాను విక్రయించింది. దీని ద్వారా కేంద్రానికి వచ్చిన అదనపు ఆదాయం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ అది సాధ్యపడేలా కనిపించట్లేదు.
బీపీసీఎల్ ప్రైవేటీకరణకు..
అందుకే చివరి అవకాశంగా ఎల్ఐసీ ప్రైవేటీకరణను నమ్ముకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ చివరి త్రైమాసికంలోనే ఎల్ఐసీ ఐపీఓను తీసుకుని రానుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణను వేగవంతం చేయడానికి అనుసరించిన వ్యూహాలను ఈ బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరిచే అవకాశాలు లేకపోలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ను విక్రయించే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇందులో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.