నిర్మలమ్మ 2022 మార్చి వరకు పొడిగించాలి, బడ్జెట్లో ఇలా చేయాలి..!
కరోనా మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ పైన భారీ ప్రభావం పడింది. ఇటీవలే కాస్త కోలుకుంటున్నాయి. హౌసింగ్ సేల్స్ క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటున్నాయని వివిధ ప్రాపర్టీ సర్వేలు వెల్లడిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో రియాల్టీ రంగం వాటా 8 శాతంగా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. కరోనాతో కునారిల్లిన రియాల్టీ రంగం ఈ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది. డిమాండ్కు ఊతమిచ్చేలా చర్యలు ఉంటాయని భావిస్తోంది.
మరిన్ని చర్యలు అవసరం
ఈసారి రియల్ ఎస్టేట్ రంగానికి బడ్జెట్ కోరికల జాబితా పెద్దగా ఉండనుందని భావిస్తున్నారు. రియాల్టీ రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద రంగంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు, రియాల్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రియాల్టీ రంగానికి ఉతమిచ్చేందుకు, వినియోగదారుల డిమాండ్ పెంచడానికి చర్యలు చేపట్టవలసి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా కారణంగా రియాల్టీ రంగానికి ఊతమిచ్చేందుకు ఇప్పటికే ఆరు నెలల మారటోరియం, ఈఎంఐ, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరమని, అయితే భారీగా దెబ్బతిన్న ఈ రంగానికి ఈ బడ్జెట్లో మరిన్ని చర్యలు అవసరమని చెబుతున్నారు.
ఇలా చేస్తే ప్రయోజనం
రెసిడెన్షియల్ ప్రాపర్టీ పైన పన్ను మినహాయింపులు ఇస్తే పెట్టుబడిదారులు అద్దెలకు ఇవ్వడానికి కూడా ఇళ్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని, అలాంటి సమయంలో అమ్ముడుపోని ఇళ్ల జాబితా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఇది రియాల్టీ రంగానికి ఊతమిస్తుందని చెబుతున్నారు. 80IBA ప్రయోజనాన్ని మెట్రో నగరాల్లో అపార్ట్మెంట్లకు 60 మీటర్ల కార్పెట్ విస్తీర్ణం వరకు విస్తరింప చేయవచ్చునని అంటున్నారు. ఇది మిడిల్ ఇన్కం గ్రూప్వారికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. గృహ రుణాలపై అసలు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పెంచవచ్చునని అంటున్నారు.
రియాల్టీ డెవలపర్లకు...
సరఫరా వైపు కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు క్రెడిట్ లభ్యత ఉండేలా చూడాలని కోరుతున్నారు. గత బడ్జెట్లో SWAMIH మంచి చొరవ అని, నిలిచిపోయిన ప్రాజెక్టుల పైన దృష్టి సారించిందని, ఇప్పుడు కరోనా వల్ల దీని పరిధిని విస్తరించవచ్చునని చెబుతున్నారు. రియాల్టీ ఎస్టేట్ నిర్మాణ పరిశ్రమలోని కార్మికులకు నిర్దిష్ట ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
2022 మార్చి 31 వరకు పొడిగించాలని
ఐటీ సెక్షన్ 24B ప్రకారం ఏటా రూ.2 లక్షల వరకు గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. గృహ రుణగ్రహీతలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పించేందుకు 2019 బడ్జెట్లో కేంద్రం సెక్షన్ 80EEAని ప్రవేశపెట్టింది. ఈ సెక్షన్ ప్రకారం 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31మధ్యలో తొలిసారి ఇళ్లు కొనుగోలు చేసిన వారు హోంలోన్పై మరో రూ.1.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం కల్పించింది.
దీంతో ఏటా రూ.3.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం లభించింది. 2020 బడ్జెట్లో ప్రభుత్వం సెక్షన్ 80EEA ప్రయోజనాలను మరో ఏడాది పాటు (2021 మార్చి 31 వరకు) పొడిగించింది. కరోనా వల్ల ప్రాజెక్టుల్లో అమ్ముడుపోని గృహాలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో సెక్షన్ 80EEAని 2022 మార్చి 31 వరకు పొడిగించాలని రియాల్టీ రంగం కోరుతోంది. రూ.45 లక్షల వరకు ఖరీదైన గృహ కొనుగోలుదారులకు మాత్రమే సెక్షన్ 80EEA ప్రయోజనాలు వర్తిస్తాయి. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో ఈ పరిమితిని రూ.65-75 లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు.