గ్రామీణాభివృద్ధికి పెద్దపీట: మరో 3 లక్షల కోట్లు వెచ్చిస్తాం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రంగాలకు అదనంగా రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు. దీంతో ఆర్థికవృద్ధి కూడా సాధిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులతో శనివారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్తో ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అటను చక్రవర్తి కూడా ఉన్నారు.
పెద్దపీట
గ్రామీణాభివృద్ధి కోసమే రూ.2.83 లక్షల కోట్లను వ్యయం చేయబోతున్నామని రాజీవ్ కుమార్ ప్రకటించారు. క్రెడిట్ నిబంధనల మేరకు 15 లక్షల కోట్లకు మూలధన వ్యయం 21 శాతం ఉంటుందని, 2.1 లక్షల కోట్ల పెట్టుబడులతో అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. 2.1 లక్షల కోట్ల పెట్టుబడిని సాధించడం సులభమేనని వివరించారు. టెలికాం స్పెక్ర్టం విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులు వస్తాయని అంచనా వేశారు. కొత్త ఆదాయపు పన్ను సంస్కరణల ద్వారా ఖర్చు చేసేందుకు 40 వేల కోట్ల వెచ్చించొచ్చని గుర్తుచేశారు.
వినియోగదారులకే మేలు
గతేడాది ఫైల్ చేసిన ఇన్ కం టాక్స్ ఆధారంగా ఆదాయపు పన్ను శాఖకు అంచనా ప్రకారం 59 శాతం మందికి లబ్ది చేకూరుతోందని రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వానికి పన్ను చెల్లించే ప్రతీ ఒక్కరికీ రూ.74 వేల వరకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు.
ఆరోగ్య రంగానికి ప్రయారిటీ
బడ్జెట్లో పన్ను స్లాబ్లను ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. 70 మినహాయింపులను తొలగించి కొత్త పన్నులను ప్రవేశపెట్టారు. దీంతో వినియోగదారులకే మేలు జరుగుతోందని రాజీవ్ కుమార్ చెబుతున్నారు. ఆయుష్మాన్ పథకంలో మౌలిక సదుపాయాలు కల్పించలేని జిల్లాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అందుకోసమే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలపై సెస్ వసూల్ చేయాలని నిర్ణయించామని.. దీంతో పథకానికి మేలు చేసినవారమవుతామని తెలిపారు.