స్టార్టప్ కంపెనీలను నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న స్టార్టుప్ వేవ్ ను ఇండియా లో కూడా కొనసాగించాలని చెప్పుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం... చేతల్లో మాత్రం చూపలేకపోయింది. శనివారం తన రెండో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... ఇండియన్ స్టార్టుప్ కంపెనీలకు తీవ్ర నిరాశను మిగిలించారు. ఏదో ఒకటి రెండు కంటి తుడుపు చర్యలు తప్ప... నిర్మాణాత్మకంగా స్టార్టుప్ కంపెనీలకు మద్దతునిచ్చే ఎలాంటి నిర్ణయాలు బడ్జెట్ లో ప్రకటించకపోవడం గమనార్హం.
భారతీయుల్లో పారిశ్రామిక తత్వం ప్రాచీన కాలం నుంచే వస్తోందని, అదే మన దేశానికి బలమని అభివర్ణించిన నిర్మల ... వారి కోసం ఏం చేస్తున్నామన్నది మాత్రం విస్మరించింది. అలాగే ప్రస్తుత యువత ఎంతమాత్రం ఉద్యోగాలు చేసేవారుగా మిగిలిపోవటం లేదని, వారు ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదుగుతున్నారని కితాబునిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా... తమ జీవితాలను, కెరీర్ ను రిస్క్ లో పెట్టి మరీ కొత్త రంగాల్లో స్టార్టుప్ కంపెనీలు ఏర్పాటు చేసే యువతకు ఎలాంటి మద్దతునిచ్చేది స్పష్టంగా చెప్పకపోవటం విచారకరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బడ్జెట్ దెబ్బ:భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 1000పాయింట్ల డౌన్, రూ.4లక్షల కోట్ల సంపద ఆవిరి
సీడ్ ఫండ్..
ప్రారంభ స్థాయిలో ఉన్న స్టార్టప్ ల కోసం సీడ్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, అడ్వైసరి సేవలు అందించేందుకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. వ్యాపారాలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చెందుకు ఒక ప్రభుత్వ పోర్టల్ ను ఏర్పాటు చేస్తామని, తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరుస్తామని ఆమె తెలిపారు. ఇవి మినహా... ఏ ఒక్క ప్రధానాంశంపై కూడా పూర్తిస్థాయి స్పష్టతను ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్టార్టుప్ సీడ్ ఫండ్ ఎంత ఉంటుంది, ఎన్ని స్టార్టుప్ లకు మద్దతునిస్తుంది, నిబంధనలు ఏమిటి అనే అంశాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. స్టార్టుప్ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించేలా ప్రకటన లేకపోవటం పారిశ్రామిక వర్గాలను విస్మయపరిచింది.
నత్త నడకన పాత ఫండ్స్...
ఇండియా లో స్టార్టుప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని 2014 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అనేకసార్లు ఘనంగా ప్రకటించారు. విశ్వవేదికలపై కూడా దీనిని గొప్పగా చెప్పుకున్నారు. నాబార్డ్, సిడ్బీ నేతృత్వంలో కూడా వెంచర్ కాపిటల్ ఫండ్స్ ఏర్పాటు చేసారు. స్టార్టుప్ ల కోసం ఏకంగా రూ 10,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయాన్నిగత బడ్జెట్ లో కూడా ప్రకటించారు. కానీ ఆచరణలో ఆ ఫండ్ ఏమైందో ఎవరికీ తెలియదు. నాబార్డ్ వద్ద ఉన్న ఫండ్ కూడా వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే కంపెనీలకు ఫండింగ్ ఇచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ బడ్జెట్ లో కూడా ఏదో కంటి తుడుపు నిర్ణయం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం స్టార్టుప్ కంపెనీలకు మింగుడుపడటం లేదు.
మూడో అతిపెద్ద మార్కెట్...
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటవుతున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలుస్తోంది. అమెరికా, చైనా తర్వాత భారత్ సగర్వంగా కొత్త ఆవిష్కరణలకు, నవకల్పనలకు, టెక్నాలజీలు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే సుమారు 10,000 రిజిస్టర్డ్ స్టార్టుప్ కంపెనీలు, 50,000 కి పైగా అన్ -రిజిస్టర్డ్ స్టార్టుప్ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వం మద్దతు నామమాత్రంగానే ఉన్నప్పటికీ.. ప్రైవేటు పెట్టుబడుల రాకతో పాటు సొంత నిధుల సాయంతో కంపెనీలు సాహసాలు చేస్తున్నాయి. ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ ఇబ్బందులు, ఇంకో వైపు తీవ్ర ఆర్థిక మందగమనం వెంటాడుతున్నా... దేశాన్ని ఉద్దరించాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు మొండి చేయి చూపటం ప్రభుత్వానికి తగదని పేరు చెప్పడానికి ఇష్టపడని స్టార్టప్ కంపెనీ ఫౌండర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, లేదంటే... ఈ రంగంలోకి యువతను ఆకర్షించటం కష్టమవుతుందని చెప్పారు. స్టార్టుప్ కంపెనీలు లేకపోతే, ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం ఉపాధి కల్పించలేదని అయన హెచ్చరించారు.