Budget 2020 శుభవార్త: నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష..నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రకటించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి కలిపి ఒకే పరీక్ష ఉంటుందని చెప్పారు. త్వరలో ఈ విధానం అమలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు యువత నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ పరీక్షలు రాస్తోంది. ఇక నుంచి అలా కాకుండా ఒకే పరీక్షను నిర్వహిస్తారు. దీనికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తున్నారు.
పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేడ్ అండ్ కన్జర్వేటివ్ను ఏర్పాటును తెలిపారు. జమ్ము కాశ్మీర్ అబివృద్ధికి రూ.30,750 కోట్లు కేటాయించారు. ఎస్సీలు, ఓబీసీలకు రూ.85వేల కోట్లు కేటాయించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ.9,500 కోట్లు కేటాయించారు.
బేటీ బజావో, బేటీ పడావో గొప్ప విజయం సాధించినట్లు చెప్పారు. లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీని, జాతీయ గ్రిడ్తో లక్ష గ్రామాల అనుసంధానం చేస్తామన్నారు. రైలు మార్గాలకు ఇరు పక్కనల సోలార్ కేంద్రాల ఏర్పాటును ప్రస్తావించారు. పర్యాటక కేంద్రాలతో తేజాస్ రైళ్లు నడుపుతామన్నారు.
నేషనల్ గ్యాస్ గ్రిడ్ను 16,300 కిలో మీటర్ల నుంచి 27 వేల కిలో మీటర్లకు పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డేటా సెంటర్ పార్కులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీతో కొత్త సంస్కరణలకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా ద్వారా డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నూతన ఆవిష్కరణలు నూతన ఆర్థిక వ్యవస్థలకు ఎంతో కీలకమన్నారు. 2024 నాటికి మరో వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నదీ తీరాల్లోను ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులను కాపాడుతామని, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పారు. సంపద సృష్టికర్తలకు దేశంలో గౌరవం ఉంటుందన్నారు.