Budget 2020: జీఎస్టీతో ఆదాయం పెరిగింది, పన్ను చెల్లింపులు మరింత సరళతరం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. జీఎస్టీతో ఆదాయం పెరిగిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం చేస్తామన్నారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరింతగా పెరిగాయన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి 16 సూత్రాల పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు.
న్యూ ఇండియా, సబ్ కా సాత్ - సబ్ కా వికాస్, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్ళు లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే దేశం ముందుకు సాగుతుందన్నారు.
ఇప్పటి వరకు 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేశారని చెప్పారు. గత రెండేళ్లలో 60 లక్షల మంది కొత్త జీఎస్టీ ట్యాక్స్ పేయర్స్ యాడ్ అయ్యారని తెలిపారు. మోడీ హయాంలో తీసుకువచ్చిన వాటిల్లో జీఎస్టీ చారిత్రక సంస్కరణ అన్నారు. ఈ బడ్జెట్ను సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు తగ్గినట్లు చెప్పారు.
జీడీపీ వృద్ధి రేటును 2014-2019 మధ్య 7.4 శాతానికి తీసుకు వచ్చామని, ద్రవ్యోల్భణం 4.5 శాతంగా ఉందన్నారు. FDIలు 2009-14 మధ్య 119 బిలియన్ డాలర్లు కాగా, 2018-19 మధ్య 284 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు చెప్పారు.