బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ స్కీం: 60,000 మంది దరఖాస్తు, టెలికం శాఖ చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. దీనికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో దాదాపు 80,000 నుంచి లక్ష మంది వరకు ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోనున్నారు. అంటే దాదాపు సగం లేదా సగానికి పైగా ఉద్యోగులు వెళ్లిపోనున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించేందుకు కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికం శాఖ ఆదేశించింది.
రోజువారీ కార్యకలాపాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్స్చైంజీల నిర్వహణ యథావిధిగా కొనసాగేలా చూడాలని సూచించింది. ఇందుకు వివిధ అవకాశాలను బీఎస్ఎన్ఎల్ పరిశీలిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు కంపెనీలో 57,000 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఎంటీఎన్ఎల్తో ఈ సంఖ్య 60వేలకు పైగా ఉంది. బీఎస్ఎన్ఎల్లో పని చేసే దాదాపు లక్షమంది వీఆర్ఎస్ అర్హులు కాగా 80 వేల మందికి పైగా వీఆర్ఎస్ తీసుకుంటారని భావిస్తున్నారు.
ఉద్యోగులను సగానికి పైగా తగ్గించుకోవాలని బీఎస్ఎన్ఎల్ చూస్తోంది. ఈ పథకం జనవరి 31, 2020 వరకు అమలులో ఉంటుంది. ఎంతమంది వీఆర్ఎస్ తీసుకుంటున్నారు, 80 వేల మంది వీఆర్ఎస్ తీసుకుంటున్నారని భావిస్తున్నామని, ఈ సంఖ్య చిన్నది కాదని, మొత్తం ఉద్యోగుల్లో సగం మంది వరకు వీఆర్ఎస్ తీసుకుంటారని భావిస్తున్నామని, డేటాను సేకరిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ చెప్పారు.