మైనస్లోకి చమురు కాంట్రాక్ట్ ధర, ఇండియాలో రగడ, హైకోర్టుకు బ్రోకరేజీ సంస్థలు
అంతర్జాతీయ చమురు మార్కెట్లను పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 20వ తేదీతో గడువు తీరిపోయిన ముడి చమురు ఫ్యూచర్ కాంట్రాక్టును బ్యారెల్కు మైనస్ 2,884 వద్ద సెటిల్మెంట్ చేసినట్లు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) తెలిపింది. పే ఇన్, పే ఔట్ ప్రక్రియ పూర్తి చేసి క్లియరింగ్ మెంబర్లకు రూ.242.32 కోట్లు డిపాజిట్ చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
మోడీ ప్రభుత్వానికి ఊహించని లాభం, నిర్మల ప్యాకేజీ కంటే డబుల్
క్రూడ్ సెటిల్మెంట్ వివాదం
అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడాయిల్ కాంట్రాక్ట్స్ సెటిల్మెంట్ ధర ఆధారంగా భారత కరెన్సీలో ఎంసీఎక్స్ పే ఇన్ అండ్ పే అవుట్ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. సోమవారం క్రూడ్ ధర అనూహ్యంగా మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20తో ముగిసే కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ సెటిల్మెంట్ ధరపై వివాదం నెలకొంది.
అందుకే రూ.2,884 వద్ద సెటిల్
న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ WTI ముడి చమురు కాంట్రాక్టు సెటిల్మెంట్ను భారత కరెన్సీలోకి మార్చి ఆ ప్రకారంగా ముడి చమురు కాంట్రాక్టుకు తాము ఎప్పుడూ సెటిల్ చేస్తామని ఎంసీఎక్స్ తెలిపింది. ఆ విధంగా బ్యారెల్కు మైనస్ 37.63 డాలర్లను మన కరెన్సీలోకి మార్పు చేసి ఏప్రిల్ 20వ తేదీతో గడువు తీరిపోయిన కాంట్రాక్టును మైనస్ రూ.2,884 వద్ద సెటిల్ చేసినట్లు తెలిపింది.
బాంబే హైకోర్టుకు బ్రోకరేజీ సంస్థలు
ఇలా చేయడం వల్ల దేశీయంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టం జరిగిందని అంచనా. ఈ నేపథ్యంలో సెటిల్మెంట్కు సంబంధించి బ్రోకేరేజీ సంస్థలు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, పీసీఎస్ సెక్యూరిటీస్, రెలిగేర్ సెక్యూరిటీస్ అన్నీ కలిసి బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.
నెగిటివ్ ధర ఎలా.. స్టే ఇవ్వండి
నెగిటివ్ ధర అనేది చట్టబద్దం కాదని, ఎక్స్చేంజ్ నియమాలకు విరుద్ధమని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. డెలివరీ ఆధారిత సెటిల్మెంట్ క్రూడా కాంట్రాక్టుల్లో లేదని, ఎక్స్చేంజీలో కేవలం నగదుతోనే చేస్తారని, అందుకే కనీసం రూపాయి వద్ద అయినా ట్రేడ్ కావాలని కానీ నెగిటివ్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఎంసీఎక్స్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ పైన స్టే కావాలని కోరాయి.
మాకు సమయం కూడా లేదు
లాక్ డౌన్ కారణంగా మార్చి 27వ తేదీ నుండి కమోడిటీ ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటలకు కుదించారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఎంసీఎక్స్ 5 గంటలకే క్లోజ్ అవుతున్నందున పెట్టుబడిదారులు ఏం చేయలేని పరిస్థితి అని, ఎంసీఎక్స్ తెరిచి ఉంటే క్లయింట్స్ వారు ఎగ్జిట్ అయ్యే అవకాశముండేదని చెప్పారు. ఎందుకంటే న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ (Nymex) ఇండియా టైమ్ ప్రకారం రాత్రి గం.10.30 వరకు ట్రేడ్ అవుతుందన్నారు.