90 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ పరుగులు, పెట్రోల్ ధర భారీగా పెరగనుందా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ కనిపించి పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 80 డాలర్ల పైకి చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేడ్ (WTI) కూడా 75 డాలర్లను క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఈ ప్రభావం మన దేశంలో పెట్రోల్, డీజిల్ పైన ప్రభావం చూపుతుంది. కరోనా కొట్టిన దెబ్బతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఇక్కడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం నాటికి వరుసగా ఆరో సెషన్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా మహమ్మారి నిబంధనలు సరళతరం చేస్తుండటంతో డిమాండ్ పుంజుకుంటోంది. అదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తి దేశాలు సరఫరాను కాస్త కఠినతరం చేశాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 42 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 79.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ 2018 తర్వాత ఈ గరిష్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సోమవారం 1.8 శాతం మేర పెరిగింది. WTI క్రూడ్ 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 75.86 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. జూలై నెల నుండి ఇది గరిష్టం. అంతకుముందు సెషన్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 2 శాతం ఎగిసింది.
ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేక..
ప్రపంచవ్యాప్తంగా బలమైన మార్కెట్ సెంటిమెంట్ నెలకొందని, అదే సమయంలో కొన్నిప్రాంతాలు సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఫుజిటోమీ సెక్యూరిటీస్ కంపెనీ లిమిటెడ్ అనలిస్ట్ తోషిటాకా తాజావా అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి జపాన్లో అత్యవసరస్థితిని (కరోనా ఆంక్షల ఎత్తివేత) ఎత్తివేసేందుకు ప్రభుత్వం సలహాదారుల ఆమోదాన్ని కోరుతోందని చెప్పారు.
దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. అలాగే వైద్యపరంగాను సరళతరం అవుతోందని ఎకానమీ మనిస్టర్ యాసుతోషి నిషిమురా అన్నారు. ఆఫ్రికన్ టాప్ చమురు ఎగుమతిదారులు నైజీరియా, అంగోలాలు ఓపెక్ కోటా స్థాయికి పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది వరకు అండర్-ఇన్వెస్ట్మెంట్, నాగింగ్ మెయింటెనెన్స్ సమస్యలు ఉత్పత్తి పైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
ఓపెక్ ప్లస్ గ్రూప్లోని పలు చమురు ఉత్పత్తి దేశాలు ఇటీవలి కాలంలో కరోనా సమయంలో డిమాండ్ పడిపోయినప్పుడు ధరలకు మద్దతుగా ఉత్పత్తిని తగ్గించాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ పుంజుకుంటున్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాయి.
క్రూడ్ ధరలు మరింత పెరుగుతాయా?
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గి, డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని, అయితే డిమాండ్కు అవసరమైన ఉత్పత్తి లేని పరిస్థితుల్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటాయి. ఈ నేపథ్యంలో గోల్డ్మన్ శాక్స్ తాజాగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటాయని అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 80 డాలర్ల వద్ద ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి ఇది 10 డాలర్లు పెరిగి 90 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల డిమాండ్ వేగంగా పుంజుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అక్కడ ధరలు పెరిగితే భారత్లోను పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. బ్యారెల్ 90 డాలర్లకు చేరుకుంటే ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర మరో రూ.5 వరకు పెరగవచ్చునని భావిస్తున్నారు. డీజిల్ ధరలు ప్రధాన నగరాల్లో రూ.100ను క్రాస్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున గత కొద్ది నెలలుగా పెరగని పెట్రోల్ ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 19 పైసల నుండి 25 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు గతవారం రోజుల్లో నాలుగోసారి పెరిగాయి. నేడు డీజిల్ ధర లీటర్ పైన 24 పైసల నుండి 27 పైసలు పెరిగింది.
మరింత వినియోగం పెరిగితే ఇబ్బందికరమే
ఆర్థిక రికవరీ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం రోజుకు మరో 0.5 మిలియన్ బ్యారెల్స్ పెరగవచ్చునని కామన్వెల్త్ బ్యాంకు కమోడిటీస్ అనలిస్ట్ వివేక్ ధర్ అన్నారు. అంటే అంతర్జాతీయ చమురు సరఫరాలో మరో 0.5 శాతం పెరగవచ్చును. చమురు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి లేదా సరఫరా అలాగే ఉంటే మరింత ఇబ్బందికరంగా మారనుంది. ఆర్థిక రికవరీ ఇటీవలే ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే చమురు సరఫరా డిమాండ్ను అందుకోలేకపోతోంది. అలాంటిది మరో 0.5 మిలియన్ బ్యారెల్స్ డిమాండ్ పెరిగితే, ఆ మేరకు ఉత్పత్తి లేక సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి.
బొగ్గు ధరలు పెరిగాయి
బొగ్గు సరఫరా కొరత, కఠినమైన ఉద్గారాల ప్రమాణాలు, తయారీదారులు, పరిశ్రమల నుండి బలమైన డిమాండ్ కారణంగా బొగ్గు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. వినియోగంపై విస్తృత నియంత్రణ నియంత్రణ నేపథ్యంలో చైనా విద్యుత్ సంక్షోభంలో ఉందని చెబుతున్నారు.
రష్యా, ఇండోనేషియా, మంగోలియా నుండి మరింత బొగ్గును దిగుమతి చేసుకోవడానికి చైనా కృషి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమల బొగ్గు కొరతను పరిష్కరించేందుకు కృషి చేయాలని చైనా అధికారులు భావిస్తున్నారు.