షాకింగ్: ఆ బిలియనీర్ డాబు, దర్పం.. అంతా నకిలీయేనా!?
లగ్జరీ లైఫ్కు ఆయన పెట్టింది పేరు.. ఎక్కడికెళ్లాలన్నా ప్రైవేట్ జట్లోనే ప్రయాణం.. దుబాయ్లోని అత్యంత ఖరీదైన భవనం బుర్జ్ ఖలీఫాలో రెండు అంతస్తులు పూర్తిగా ఆయన సొంతం.. ఇక రాజకీయవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు.. వెరసి ఒకప్పుడు ఆయన రారాజుగా ఒక వెలుగు వెలిగాడు.. అయితే ఇదంతా గతం!
ఇప్పుడు సీన్ రివర్స్! ఆయన కంపెనీలపై అనేక ఆరోపణలు.. దీంతో షేర్లు కుప్పకూలాయి.. ఫలితంగా ఆయన సంపద హరించుకుపోయింది.. ఒకప్పటి బిలీనియర్ ఇప్పుడు మిలీనియర్ స్థాయికి పడిపోయాడు.. పైగా ఆయన కంపెనీలు, షేర్ల విలువ, ఆస్తుల విలువ అంతా బోగస్ అనే టాక్.. ఆయన పేరు.. బావగుతు రఘురామ్ షెట్టి.. కార్పొరేట్ లోకంలో బీఆర్ షెట్టిగా పిలుస్తారు.
సామాన్యుడి నుంచి బిలియనీర్ వరకు...
బావగుతు రఘురామ్ షెట్టి(బీఆర్ షెట్టి) 1942లో ఉడిపిలో జన్మించాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన షెట్టి కొంతకాలంపాటు ఫార్మా రంగంలో సేల్స్మాన్గా పనిచేశాడు. 1973లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లిన తరువాత.. అక్కడే ఫార్మసీలో క్లినికల్ డిగ్రీ పుచ్చుకున్నాడు. ఆపైన 1975లో అబుదాబిలో సొంతగా ‘ఎన్ఎంసీ హెల్త్' పేరిట ఒక మెడికల్ నెట్వర్క్ను కంపెనీని స్థాపించాడు. ఆ తరువాత నియో ఫార్మా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని కూడా ఏర్పాటు చేశాడు. గల్ఫ్తోపాటు ఇండియా, నేపాల్, ఆఫ్రికాలో ఉన్న హెల్త్ కేర్ ఫార్మా ‘బీఆర్ లైఫ్' కూడా బీఆర్ షెట్టిదే. షెట్టికి చెందిన ఎన్ఎంసీ హెల్త్ 2012లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన తొలి అబుదాబి కంపెనీగా పేరు తెచ్చుకుంది.
బాలీవుడ్లోనూ మెరవాలనుకున్నాడు, కానీ...
బీఆర్ షెట్టి తన కేరీర్ను మున్సిపల్ కౌన్సిల్లో వైస్ ఛైర్మన్గా ప్రారంభించాడు. 2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. ఈయన ఇండియాలోని అత్యంత సంపన్నుల్లో 42వ వాడు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా పొందాడు. బీఆర్ షెట్టికి అతడి స్వస్థలమైన ఉడిపితోపాటు దుబాయ్, అబుదాబి, లండన్, పెర్త్, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో నివాస భవనాలు ఉన్నాయి. ఆయన వద్ద బోలెడు వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ‘ఫినాబ్లర్' పేరిట ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్కు సంబంధించి ఓ పేమెంట్ కంపెనీని కూడా ఏర్పాటు చేశాడు. ఇది రెండేళ్ల క్రితం లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అంతేకాదు, బీఆర్ షెట్టి బాలీవుడ్లో కూడా మెరవాలని అనుకున్నాడు. దీనికి బాలీవుడ్ ప్రముఖులతో అతడికున్న పరిచయాలు ఉపయోగపడ్డాయి. 2017లో ఫిల్మ్ మేకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినా ఎందుకో ఆ రంగంలో సక్సెస్ సాధించలేకపోయాడు.
‘మడ్డీ వాటర్స్’ చెక్తో అంతా తలకిందులు...
బీఆర్ షెట్టి లగ్జరీ జీవితంలో ఒక పెద్ద కుదుపు.. అతడి వ్యాపార రంగంలోకి కార్సన్ బ్లాక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ‘మడ్డీ వాటర్స్' అడుగుపెట్టింది. ఈ సంస్థ పబ్లిక్ కంపెనీల్లో ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులను విశ్లేషిస్తూ, వాటిలోని అవకతవకలను వెలుగులోకి తీసుకురావడం ఈ సంస్థ పని. బీఆర్ షెట్టి కంపెనీ.. ఎన్ఎంసీ హెల్త్ పీఎల్సీలోనూ పెద్ద స్కామ్ జరిగిందని, అకౌంట్ల లావాదేవీలలో అన్నీ అవకతవకలే ఉన్నాయని, ఆయనదంతా కనికట్టు వ్యవహారమని, లగ్జరీ జీవితాన్ని అనుభవించేందుకు తన వద్ద లేని ఆస్తులు అతడు సృష్టించాడని మడ్డీ వాటర్స్ ఆరోపణలు చేసింది. దీంతో అప్పటివరకు కార్పొరేట్ రంగంలో రాజుగా వెలిగిపోతున్న బీఆర్ షెట్టికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
కంపెనీల విలువ పెంచి చూపెట్టారా?
బీఆర్ షెట్టికి చెందిన కంపెనీల అకౌంట్లపై స్క్రూటినీ మొదలుపెట్టిన మడ్డీ వాటర్స్.. ఎన్ఎంసీ హెల్త్ పీఎల్సీ తన బ్యాలెన్స్ షీటును తారుమారు చేసిందని, అది కొన్న కంపెనీల విలువను బాగా పెంచి చూపించిందని కనుగొంది. ఆయా ఆస్తుల కొనుగోలుకు ఎక్కువ పేమెంట్స్ చేశారని, రుణాలను తక్కువ చేసి చూపించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ షెట్టికున్న షేర్ల విలువ, ఆయన సంపదపై కూడా మడ్డీ వాటర్స్ అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు న్యాయ సంస్థ హెర్బర్ట్ స్మిత్ ప్రీహిల్స్ కూడా రంగంలోకి దిగింది. ఇది కూడా షెట్టి హోల్డింగ్స్పై సమీక్ష మొదలెట్టింది. లోకల్ రెగ్యులేటర్స్ కూడా షెట్టి కంపెనీలు, సంబంధిత పార్టీలపై విచారణ జరుపుతున్నది నిజమేనని ఎన్ఎంసీ అధికార ప్రతినిధి యూకే ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీకి తెలియజేశారు.
షేర్లు పడిపోయి, సంపద తరిగిపోయి...
‘మడ్డీ వాటర్స్' రిపోర్ట్ వెలుగులోకి వచ్చినప్పట్నించి బీఆర్ షెట్టి కంపెనీలకు సంబంధించిన షేర్ల విలువ పడిపోతూనే ఉంది. యూఏఈలో అతిపెద్ద హెల్త్కేర్ ప్రొవైడర్ అయిన ఎన్ఎంసీ షేర్లు ఇప్పటి వరకు 67 శాతం పతనం అయ్యాయి. ఈ సంస్థపై తాజాగా టేకోవర్ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ల అమ్మకాల సెగ షెట్టి గ్రూప్ కంపెనీల్లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన ‘ఫినాబ్లర్'ను కూడా తాకింది. దీని షేర్ల కూడా 64 శాతం వరకు క్షీణించాయి. ఫలితంగా ఆయా కంపెనీల్లో బీఆర్ షెట్టికున్న వాటాల విలువ భారీగా తగ్గిపోయింది. ఈ కంపెనీల్లో ఒకప్పుడు ఆయనకున్న వాటాల విలువ 2.4 బిలియన్ డాలర్లు. మడ్డీ వాటర్స్ ఆరోపణలతో షెట్టి సంపదపై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆయన సంపద ఒక్కసారిగా 885 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒకప్పుడు అత్యంత సంపన్నుల్లో ఒకడిగా చలామణీ అయిన బీఆర్ షెట్టి ఇమేజ్ ఇప్పుడు మసకబారిపోయింది. అయితే షెట్టి మాత్రం తనపైన, తన కంపెనీలపైనా మడ్డీ వాటర్స్ చేస్తోన్న ఆరోపణలు నిరాధారం అని అంటున్నారు.