మరో అడుగు: చైనాకు హీరో సైకిల్స్ రూ.900 కోట్ల షాకిచ్చి, ఇక్కడి వారికి అండగా..
భారత్ సైకిల్ మార్కెట్ లీడర్ హీరో సైకిల్స్ చైనాకు భారీ షాకిచ్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో బాయ్కాట్ చైనీస్ ప్రోడక్ట్ ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వ్యాపారులు, సంస్థలు చైనా ఉత్పత్తులను పక్కన పెడతామని చెబుతుండగా, తాము కొనుగోలు చేయమని మెజార్టీ ప్రజలు చెబుతున్నారు. దీనికి అదనంగా జాతీయ భద్రత కోసం ప్రభుత్వం కూడా 59 యాప్స్ను నిషేధించింది. రహదారుల నిర్మాణంలో చైనాను పక్కన పెడదామని చెబుతున్నాయి.
కరోనా దెబ్బతో కుప్పకూలిన ఆ దేశ ఎకానమీ, శాలరీ లేక 20 రాత్రులు వీధుల్లోనే
హీరో సైకిల్స్ కీలక నిర్ణయం
ఇలాంటి కీలక సమయంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న రూ.900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం రానున్న 3 నెలల్లో చైనాతో రూ.900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని, దీనిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో తామూ కలుస్తామని చెప్పారు.
కొత్త మార్కెట్ కోసం అన్వేషణ
చైనీస్ భాగస్వాములతో సంబంధాలను రద్దు చేసుకున్న నేపథ్యంలో కొత్త మార్కెట్ కోసం అన్వేషిస్తున్నట్లు పవన్ ముంజాల్ తెలిపారు. యూరోప్ మార్కెట్లను అందిపుచ్చుకునే ఉద్దేశ్యంతో జర్మనీలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇది చైనాకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు చెప్పారు. హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్ ప్రాజెక్టులో 72 శాతం షేర్లు భారత్కు చెందినవేనని చెప్పారు.
చైనాకు చెక్.. వీటికి టెక్నికల్ సపోర్ట్
చైనా తీరుపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సైకిల్ పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్తలు బిజినెస్ విస్తరణ కోసం వియత్నాం, థాయ్లాండ్, తైవాన్ వంటి దేశాల వైపు చూస్తున్నారన్నారు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా సైకిల్స్కు డిమాండ్ పెరిగిందని, ఈ డిమాండ్కు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ప్రతికూల ప్రభావం పడిన చిన్న కంపెనీలపై పవన్ ముంజాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొన్ని సంస్థలకు టెక్నికల్ సపోర్ట్ అందించడం ద్వారా చైనా నుండి దిగుమతి అవుతున్న హై-ఎండ్ సైకిల్ భాగాలను తయారు చేస్తాయి.