భారీగా పెరిగిన బుక్ మై షో ఆదాయం... ఎంత పెరిగిందో తెలుసా?
భారత్ లో విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో ఒకటైన బుక్ మై షో ఆదాయార్జనలోనూ దూసుకుపోతోంది. 1999 లో స్థాపించిన ఈ కంపెనీ రెండు దశాబ్దాలుగా అనేక విపత్కర పరిణామాలను చూసింది. కానీ ఇప్పటికీ విజయవంతంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పైగా ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలోనూ ఆదాయాన్ని భారీగా పెంచుకోంది. ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ లో తనకు తిరుగు లేదని నిరూపించుకొంది. ఈ కంపెనీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుతం బుక్ మై షో వాల్యుయేషన్ 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,000 కోట్లు) దాటడంతో యునికార్న్ క్లబ్ లో చేరిపోయింది. దేశంలో యునికార్న్ స్థాయిని చేరుకొన్న అతికొద్ది కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. బుక్ మై షో బ్రాండ్ పేరుతో బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా లో కార్యకలాపాలు సాగిస్తుంది. దీనిని ఆశిష్ హెమ్ రజని స్థాపించారు. వై2కే ప్రాబ్లెమ్ వచ్చిన సమయంలో పురుడు పోసుకున్న బుక్ మై షో ఇంత కాలం మార్కెట్లో నిలదొక్కుకోవటమే కష్టమైతే... మార్కెట్ లీడర్ గా ఆవిర్భవించటం మరింత విశేషం.
52% పెరిగిన ఆదాయం...
బుక్ మై షో ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 52% పెరిగి రూ 594 కోట్లకు చేరుకొంది. అంతక్రితం ఏడాది సంస్థ ఆదాయం రూ 391 కోట్లుగా ఉంది. ఈ విషయాన్నీ ప్రముఖ డీల్ ట్రాకింగ్ సంస్థ ఎంట్రాకర్ ఒక కథనంలో వెల్లడించింది. లైవ్ ఈవెంట్స్ విభాగం దాదాపు ఎనిమిదిన్నర రేట్లు పెరగటంతో కంపెనీ ఆదాయంలో మెరుగైన వృద్ధి కనిపించింది. ఈ విభాగం గతంలో కేవలం రూ 12.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ... ప్రస్తుతం అది రూ 105 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఆన్ లైన్లో టిక్కెట్ల విక్రయంతో రూ 332 కోట్ల రాబడి నమోదు అయ్యింది. సాఫ్ట్ వేర్ సేవల ద్వారా రూ 58 కోట్ల ఆదాయం సమకూరింది. టిక్కెట్ల విక్రయంలో 21.5%, సాఫ్ట్ వేర్ సేవల్లో 25.5% వృద్ధి నమోదయ్యింది.
హైదరాబాద్ ప్రయాణీకులకు శుభవార్త: మెట్రోలో G5 సేవలు.. కానీ!
థియేటర్ల కు చెల్లించే కమిషన్...
తొలుత ప్రింటెడ్ మూవీ టిక్కెట్లను వినియోగదారుల ఇంటికే డెలివరీ చేసే బుక్ మై షో... కాల క్రమంలో కేవలం ఆన్లైన్ బుకింగ్ కు పరిణామం చెందింది. కంపెనీ ఇలా ఆన్లైన్ లో టిక్కెట్ల విక్రయించేందుకు అనుమతించే థియేటర్ల తో కమిషన్ చెల్లించే విధంగా కంపెనీ అగ్రీమెంట్లు కుదుర్చుకొంది. దాని ప్రకారం ఏటా ఈ కంపెనీ థియేటర్లకు పెద్ద మొత్తంలో కమిషన్ చెల్లిస్తుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బుక్ మై షో ఇలా థియేటర్లకు రూ 173 కోట్లను చెల్లించింది. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఈ కమిషన్ చెల్లింపులు 85% నికి పైగా పెరగటం గమనార్హం.
ఉద్యోగుల జీతాలు...
ప్రస్తుతం దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టుప్ కంపెనీల్లో 95% నికి పైగా సంస్థలు 2008-09 తర్వాత ఏర్పాటు చేసినవే ఉన్నాయి. అందులోనూ సుమారు 90% కంపెనీలు కనుమరుగయ్యాయి. కానీ 20 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని బుక్ మై షో కొనసాగిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులకు మెరుగైన జీత భత్యాలు చెల్లిస్తుంది. 2018-19 లో కంపెనీ రూ 144 కోట్ల నిధులు ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం వినియోగించింది. అంతక్రితం ఏడాది ఈ మొత్తం రూ 130 కోట్లుగా ఉంది. ఈవెంట్లు నిర్వహించే సమయంలో ఆర్టిస్టుల కు కూడా బుక్ మై షో భారీ మొత్తాలను ఆఫర్ చేస్తుంది. అలా ఈ ఏడాది కంపెనీ రూ 27 కోట్లను చెల్లించింది. ఇది 2017-18 లో కేవలం రూ 13 కోట్లుగా ఉండేది.
తగ్గిన నష్టాలు...
ప్రారంభించి రెండు దశాబ్దాలు గడుస్తున్నా... బుక్ మై షో మాత్రం ఇప్పటికీ లాభాలు కళ్ళ చూడలేదు. కానీ నష్టాలను తగ్గించుకొంటూ వస్తోంది. 2017-18లో కంపెనీ నష్టం రూ 162 కోట్లు కాగా 2018-19 లో అది 29% తగ్గి రూ 115 కోట్లకు పరిమితమైంది. 2018-19 లో కంపెనీ చాలా వరకు ఖర్చులను కట్టడి చేసినప్పటికీ మొత్తం వ్యయాలు సుమారు 30% పెరిగి రూ 733 కోట్లకు పెరిగాయి. దీంతో బుక్ మై షో కు నష్టాలు తప్పలేదు. ఆన్లైన్ లో టిక్కెట్ల బుకింగ్ రంగంలో బుక్ మై షో కు పేటీీఎం తో పోటీ నెలకొంది. అయితే ఆదాయార్జనలో మాత్రం బుక్ మై షో మెరుగ్గా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2019 లో పేటీఎం 10 కోట్ల టిక్కెట్లను విక్రయించినట్లు ప్రకటించింది. కానీ బుక్ మై షో సుమారు 20 కోట్ల టిక్కెట్ల ను విక్రయించే టార్గెట్ పెట్టుకోవటం విశేషం.