40,000 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్, ఏడాదిలో 14000 శాతం పెరిగిన డోజీకాయిన్
2021లో క్రిప్టో బిట్ కాయిన్ ఆకాశానికి ఎగిసి, అంతలోనే పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటోంది. డబ్బు క్రమంగా ఎలక్ట్రానిక్ రూపంలోకి మారుతోంది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి డిజిటల్ కరెన్సీపై పడింది. చైనా నిర్ణయం, ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ సమయంలో 65వేల డాలర్లను తాకిన బిట్ కాయిన్ ఆ తర్వాత 40వేల డాలర్ల దిగువకు పతనం అయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ తిరిగి 40వేల మార్కును దాటింది. నేడు బిట్ కాయిన్ ప్రారంభ సెషన్లో 7.6 శాతం ఎగిసి 40,501 డాలర్లను తాకింది. ఆ తర్వాత స్వల్పంగా క్షీణించినప్పటికీ, 40వేల డాలర్ల పైనే ఉంది.
క్రిప్టో మార్కెట్
బిట్ కాయిన్తో పాటు ఎథేరియం కూడా బలపడింది. బ్లూమ్బర్గ్ గెలాక్సీ క్రిప్టో ఇండెక్స్ 12 శాతం లాభాల్లో కనిపించింది. గత వారం దారుణ పతనం తర్వాత క్రమంగా కోలుకుంటోంది క్రిప్టో మార్కెట్. బిట్ కాయిన్ ఎనర్జీ కన్సంప్షన్ పైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన అనంతరం వర్చువల్ కరెన్సీ వ్యాల్యూ భారీగా పడిపోయింది. దీనికి తోడు చైనా నిర్ణయం బిట్ కాయిన్ అమ్మకాల వెల్లువకు కారణమైంది. ప్రస్తుతం బిట్ కాయిన్ పాజ్ అయిందని చెబుతున్నారు.
25వేల డాలర్లు తక్కువే
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తన కంపెనీ తరఫున బిట్ కాయిన్లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. తమ ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా బిట్ కాయిన్ను అంగీకరిస్తుందని తెలిపారు. అయితే ఇటీవల టెస్లా అధినేత యూటర్న్ తీసుకోవడం బిట్ కాయిన్ పైన ప్రభావం పడి పతనమైంది. ఏప్రిల్ గరిష్ట రికార్డ్ 65వేల డాలర్ల నుండి బిట్ కాయిన్ ఇప్పటికీ 25వేల డాలర్ల క్షీణతతో ఉంది.
ఈ మూడు క్రిప్టోలు ఎంత ఎగిశాయంటే
గత ఏడాది కాలంగా క్రిప్టోకరెన్సీలు లాభపడుతున్నాయి. ఇందులో బిట్ కాయిన్ అయితే ఏకంగా అరవై ఐదువేల డాలర్ల వరకు ఎగిసింది. ఏడాది కాలంలో బిట్ కాయిన్ 358 శాతం పెరిగింది. ఇక ఆల్ టైమ్ గరిష్టాన్ని పరిగణలోకి తీసుకుంటే 700 శాతం కంటే ఎక్కువగా ఎగిసింది. ఇక మరో క్రిప్టో ఎథేరియం 1300 శాతం పెరిగింది. డోజీకాయిన్ 14000 శాతం పెరిగింది.