ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, బిట్ కాయిన్ సహా క్రిప్టో భారీ జంప్
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ భారీగా ఎగిసింది. బిట్ కాయిన్ నేడు 32,000 డాలర్లను క్రాస్ చేసింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా జంప్ చేశాయి. ఇందుకు ప్రధాన కారణం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు. గతంలో ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా క్రిప్టో బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసింది. అయితే పర్యావరణ అంశానికి సంబంధించి ఆ తర్వాత మస్క్ చేసిన వ్యాఖ్యలకు తోడు చైనా, టర్కీ తదితర దేశాల నిర్ణయాలు క్రిప్టో కరెన్సీ పైన పెను ప్రభావం చూపాయి.
క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ అయితే ఇటీవల 29వేల డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ మస్క్ వ్యాఖ్యలు ఊతమిచ్చాయి.
ఎలాన్ మస్క్ ఏమన్నారు?
టెస్లా కొనుగోలు చేసిన బిట్ కాయిన్స్ సహా క్రిప్టో కరెన్సీని విక్రయిస్తారని ఇన్వెస్టర్లు భావించారు. కానీ తాజాగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ స్పెసెక్స్ వద్ద కూడా డిజిటల్ టోకెన్స్ ఉన్నాయని, వీటిని విక్రయించే ఆలోచన లేదని చెప్పారు. బిట్ కాయిన్తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు ఎథేర్, డోజీకాయన్ కూడా లాభపడ్డాయి. తన వద్ద స్వయంగా మూడు డిజిటల్ టోకెన్స్ ఉన్నాయని ఈ టెస్లా అధినేత తెలిపారు. టెస్లా, స్పెసెక్స్ బిట్ కాయిన్స్ను కలిగి ఉన్నాయి. మస్క్ వ్యాఖ్యలతో ఇటీవల 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ ఇప్పుడు 32,000 డాలర్లు దాటింది.
వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
బిట్ కాయిన్ 32,012.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎథేర్ 1,984.69 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.192449 డాలర్ల వద్ద, లైట్ కాయిన్ 118.26 డాలర్ల వద్ద, XRP 0.585495 డాలర్ల వద్ద, కార్డానో 1.17 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్, ఎథేర్, డోజీకాయిన్ గత 24 గంటల్లో నాలుగు శాతం నుండి ఆరు శాతం ఎగిశాయి.
1.3 ట్రిలియన్ డాలర్లు పతనం
బిట్ కాయిన్ గత రెండు సెషన్లుగా 30వేల డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. మే నెల నుండి బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.3 ట్రిలియన్ డాలర్లు పతనమైంది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యల ప్రభావం క్రిప్టో పైన బాగానే ఉంది. దీంతో పాటు చైనా, యూరోప్, అమెరికా దేశాల రెగ్యులేషన్స్ ప్రభావం కూడా ఉంది.