బిట్ కాయిన్ ఇండియాలో ఇక లీగల్, సుప్రీం కోర్ట్ తీర్పుతో మళ్ళీ సేవలు ప్రారంభం!
భారత దేశంలో బిట్ కాయిన్ మళ్ళీ అందుబాటులోకి రానుంది. కొన్నేళ్లుగా బిట్ కాయిన్ సహా అనేక క్రిప్టో కరెన్సీల పై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన నిషేధం చెల్లదని ఇటీవల సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో క్రిప్టో కరెన్సీ సంస్థలు మళ్ళీ ఇండియా లో తమ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం ఐంది. త్వరలోనే ట్రేడింగ్ జరిపేందుకు క్రిప్టో సంస్థలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. డిజిటల్ కరెన్సీ గానూ పేర్కొనే బిట్ కాయిన్ వంటి ఊహాజనిత కరెన్సీ లను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు అన్నీ తమ వంతు కృషి చేస్తున్నాయి.
కానీ అమెరికా, కెనడా, చాలా వరకు యూరోప్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, రష్యా వంటి ప్రధాన దేశాలు బిట్ కాయిన్ చెలామణిని అంగీకరిస్తున్నాయి. అందుకే భారత్ సహా ఇతర వర్ధమాన దేశాల్లోనూ ఈ కరెన్సీలను విస్తృతం చేయాలని ఫిన్ టెక్ రంగలోని స్టార్టుప్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, బిట్ కాయిన్ సహా ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీ లను ఏ ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఒక దేశం నియంత్రించటం లేదు కాబట్టి అలాంటి కరెన్సీ లావాదేవీలు చట్ట విరుద్ధం అని ఇండియా వంటి దేశాల అభిప్రాయంగా ఉంది.
రెండేళ్ల క్రితం నిషేధం...
బిట్ కాయిన్ వాడకం సహా అందులో ట్రేడింగ్ పై కూడా నిషేధం విధిస్తూ 2018 ఏప్రిల్ లో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బిట్ కాయిన్ సహా ఎటువంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు కూడా తమ నెట్ వర్క్ సేవలు అందించకూడని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. చట్టపరంగా బిట్ కాయిన్ ఇండియాలో చెల్లుబాటు కాదని, దాని వాడకాన్ని నిషేదిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పుడప్పుడే ఇండియాలో విస్తరిస్తున్న బిట్ కాయిన్ సంస్కృతీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డట్లు ఐంది. సరిగ్గా మన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా జరుగుందో... అలాగే మొబైల్ ఆప్స్ ద్వారా బిట్ కాయిన్ ట్రేడింగ్ కూడా జరిగేది. విదేశాల నుంచి ఏదైనా సరుకులు కొనుగోలు చేస్తే... వాటికి సంబంధించిన సొమ్మును డాలర్లు లేదా ఇతర కరెన్సీల్లో చెల్లించే బదులు తమ దగ్గర ఉన్న బిట్ కాయిన్ లను ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోయేది. దీంతో విదీశీ మారకం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
2009 లో మొదలు...
బిట్ కాయిన్ అనేది 2009 జనవరి లో తొలిసారి ప్రపంచం ముందుకు వచ్చింది. సతోషి నకమొటో అనే వ్యక్తి దీని వ్యవస్థాపకుడు. ఇది పూర్తిగా ఒక డిజిటల్ కరెన్సీ. భౌతిక రూపం ఉండదు. అలాగే ఈ కరెన్సీ ని ఏ దేశం కానీ, ఏ సెంట్రల్ బ్యాంకు కానీ నియంత్రిచలేదు. అలాగే, దీన్ని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకునేందుకు మధ్యవర్తుల అవసరం కూడా లేదు. సింపుల్ గా చెప్పాలంటే... మన ఫోన్లలో వాట్సాప్ వాడుతున్నంత ఈజీగా ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ లో ఫోటో షేర్ చేసినంత సులభంగా నెట్ వర్క్ పరిధిలోని వినియోగదారులు బిట్ కాయిన్ కూడా ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. ఈ లావాదేవీలు జరిపినందుకు ఎవరికి ఎటువంటి పన్నులు చెల్లించనక్కర లేదు. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ లభించింది.
ఒక్క బిట్ కాయిన్ విలువ రూ 6.73 లక్షలు...
సతోషి నకమొటో జపాన్ కు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ అని చెబుతారు. అయన బిట్ కాయిన్ తో పాటు బ్లాక్ చైన్ ను కూడా తొలిసారి వినియోగించి రికార్డులకెక్కారు. నకమొటో కనిపెట్టిన బిట్ కాయిన్ విలువ తొలినాళ్లలో చాలా తక్కువగా ఉండేది. 2010 లో ఒక పిజ్జా కొనుగోలు చేయాలంటే సుమారు 1,000 బిట్ కాయిన్లు ఇవ్వాల్సి వచ్చేది. కానీ, దాని విలువ అంతకంతకూ పెరుగుతూ ప్రస్తుతం ప్రపంచంలోని బలమైన కరెన్సీ లకు కూడా సవాలు విసురుతోంది. ప్రపంచమంతా రెడ్ కార్పెట్ పరిచే అమెరికా డాలర్ విలువ మన కరెన్సీ లో రూ 70 గా ఉంటే ... ఒక్క బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం రూ 6,73,572 గా ఉండటం గమనార్హం. అందుకే, నిపుణులు ఇలాంటి అనుమతి లేని డిజిటల్ కరెన్సీ ల్లో ట్రేడింగ్ చేసి నష్టపోవద్దని సూచిస్తుంటారు. కానీ, ప్రస్తుతం సాక్షాత్తూ మన సుప్రీం కోర్ట్ బిట్ కాయిన్ పై నిషేధం ఎత్తివేయాలని ఆర్బీఐ ని ఆదేశించింది కాబట్టి... ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.