ఆ రంగంలో భారత్ ఆదర్శం.. చైనా కాకుండా ఇప్పుడు స్టడీ చెయ్యల్సింది ఇండియానే.. బిల్ గేట్స్ కితాబు
డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారతదేశం అద్భుతమైన పద్దతులను అవలంబిస్తున్నదని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు , టెక్ పయినీర్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. చైనా కాకుండా మరే దేశం నుంచైనా ఏదైనా నేర్చుకోవాలంటే , కచ్చితంగా భారతదేశం వైపు చూడాల్సిందేనని ఆయన భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు .
చైనా నుండి ఇండియాకు దిగుమతులు 13% క్షీణత .. భారత్ ఎగుమతులు 16% పెరుగుదల : కస్టమ్స్ డేటా
డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలపై భారతదేశ విధానాలను ప్రశంసించిన బిల్ గేట్స్
డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలపై ఆయన భారతదేశ విధానాలను ప్రశంసించారు. దేశం యొక్క అమలుకు నమూనాగా ఉన్న ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను రూపొందించడానికి తమ దాతృత్వ సంస్థ కృషి చేస్తోందని, ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ మరియు ఏదైనా బ్యాంక్ లేదా స్మార్ట్ ఫోన్ల మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులను పంపే వ్యవస్థతో పాటు డిజిటల్ చెల్లింపుల కోసం భారతదేశం ప్రతిష్టాత్మక వేదికలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ఒక దేశాన్ని అధ్యయనం చెయ్యాలంటే చైనాను కాదు ఇండియా ను ఎంచుకోవాలి
భారత్ లోని డిజిటల్ విధానాలు పేదలకు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం అందించిన సహాయాన్ని పంపిణీ చేసే ఖర్చు మరియు ఇబ్బందిని బాగా తగ్గించాయని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ఒక దేశాన్ని అధ్యయనం చేయబోతున్నట్లయితే, చైనా కాకుండా, వారు భారతదేశం వైపు చూడాలని నేను చెప్తాను అని బిల్ గేట్స్ సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో అన్నారు. భారత్ లో ఆర్థిక లావాదేవీల కోసం అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్న విషయం మనందరికీ తెలుసు.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన ప్రభుత్వం
యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రభుత్వం ఒక ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావడం, ఈ డిజిటల్ విధానానికి స్మార్ట్ ఫోన్ ల బూమ్ తోడుకావడంతో ఇండియా లో భారీ ఎత్తున డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అవినీతిని అరికట్టడానికి మరియు భారతీయులను నగదు నుండి దూరం చేసే ప్రయత్నంలో దేశంలో 2016 లో ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ను చేసింది. ఆ తర్వాత నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది. ఇక వ్యాపార లావాదేవీలు జరిపే కంపెనీలు కూడా తమ యుపిఐ ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని భారతదేశం ఆదేశించింది.
భారతదేశం ఆ రంగంలో ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ .. బిల్ గేట్స్ కితాబు
వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ మాట్లాడుతూ భారతదేశం ఆ రంగంలో ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ అని కితాబిచ్చారు . కోవిడ్ -19 మహమ్మారిని అంతం చేయడానికి కూడా టీకాలు ఎంత త్వరగా అభివృద్ధి చేయబడుతున్నాయనే దానిపై బిల్ గేట్స్ ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో సుమారు ఆరు వ్యాక్సిన్స్ లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాక్సిన్స్ విషయంలో ఇది ఒక ముఖ్యమైన పురోగతి అని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ విషయంలోనూ కీలక వ్యాఖ్యలు
మొత్తం డిజిటల్ విషయాలు - రిమోట్ లెర్నింగ్, టెలిమెడిసిన్, డిజిటల్ ఫైనాన్స్ - చాలా అభివృద్ధి చెందాయి అని ఆయన చెప్పారు.వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే సాంకేతికత వేగవంతమైంది అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. కానీ వ్యాక్సిన్ విషయం లో పేద ధనిక దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన బిల్ గేట్స్ , టీకాలను ముందు ఎవరికి అందించాలో ధనిక దేశాలు నిర్ణయించకూడదని పేర్కొన్నారు. అందరికీ సమానంగా వ్యాక్సిన్ అందేలా చూడాల్సిన బాధ్యత ఉందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. 2022 నాటికి కరోనా పూర్తిగా అంతమై పోయే అవకాశముందని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.