ఏడాది తర్వాత పునఃప్రారంభం: బిగ్ బాస్కెట్ ఎక్స్ప్రెస్ డెలివరీ! హైదరాబాద్లోనూ సేవలు
కరోనా వైరస్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావటం లేదు. లాక్ డౌన్ సడలించినా బయట మార్కెట్లో ఎక్కువ మంది తో కలిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్న ప్రజలు తమ నిత్యావసర సరుకుల కోసం ఆన్లైన్ పోర్టల్స్ పై ఆధారపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో మాత్రం ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి పెద్ద ఈ కామర్స్ సంస్థల కార్యకలాపాలపై నిషేధం ఉన్నప్పటికీ... కూరగాయలు, పండ్లు, గ్రోసరీ సరుకులు సరఫరా చేసే కంపెనీలకు మాత్రం అనుమతించారు.
సరిగ్గా ఇదే సేవలు అందించే బిగ్ బాస్కెట్ కు ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగిపోయింది. కానీ, విపరీతంగా వచ్చే ఆన్లైన్ ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఏ కంపెనీకైనా అతి పెద్ద నెట్ వర్క్ ఉండి తీరాలి. లేదంటే డెలివరీ లు చాలా ఆలస్యం అవుతాయి. ఇది అన్ని కంపెనీలకు, కస్టమర్ల కు కూడా ఎదురయ్యే అనుభవమే. అందుకే, ఇప్పుడున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్కెట్ సరికొత్త సేవలను ప్రారంభించింది.
సరిహద్దులో టెన్షన్: ఈ భారతీయ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులు, మరి ఇప్పుడు?
అదే రోజు డెలివరీ...
బిగ్ బాస్కెట్ ఎక్ష్ప్రెస్స్ డెలివరీ పేరుతో వేగంగా డెలివరీ చేసే సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలను ఏడాది క్రితమే బిగ్ బాస్కెట్ నిలిపివేసింది. కానీ ప్రస్తుతం మళ్ళీ డిమాండ్ అధికమవడంతో తిరిగి ఈ సేవలను పునరుద్ధరించింది. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. కరోనా తీసుకొచ్చిన లాక్ డౌన్ తర్వాత దేశంలోని 10 ప్రధాన నగరాల్లో కూరగాయలు, గ్రోసరీ సరుకుల ఆన్లైన్ డెలివరీ కి డిమాండ్ అధికంగా పెరిగిపోయింది. దీంతో ఈ రంగంలో ఇప్పటికే నెంబర్ 1 గా నిలిచిన బిగ్ బాస్కెట్ దూసుకుపోతోంది. అయితే, ఇటీవల ఈ రంగంలోకి స్విగ్గి, డాంజో వంటి సంస్థలు కూడా అడుగిడాయి. కానీ ఎప్పటి నుంచో ఈ రంగంలో సేవలు అందిస్తున్న అనుభవంతో బిగ్ బాస్కెట్ మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. అదే అనుభవంతో ఎక్ష్ప్రెస్స్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది.
3 నగరాల్లో సేవలు...
బిగ్ బాస్కెట్ ఎక్ష్ప్రెస్స్ డెలివరీ సేవలు ప్రస్తుతానికైతే కేవలం మూడు నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ తో పాటు మన హైదరాబాద్ లో కూడా సేవలు మొదలయ్యాయి. ఈ విషయాన్నీ ఎంట్రాకర్ తన కథనంలో వెల్లడించింది. ఎక్ష్ప్రెస్స్ డెలివరీ ద్వారా బిగ్ బాస్కెట్ అదే రోజు సరుకులను డెలివరీ చేస్తుంది. కానీ ప్రతి డెలివరీ పై రూ 45 నుంచి రూ 75 వరకు డెలివరీ చార్జీలను వసూలు చేస్తుంది. అయినప్పటికీ వేగంగా తమ సరుకులను పొందాలన్న కస్టమర్లు ఈ సర్వీస్ లు పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తామే స్వయంగా మార్కెట్ కు వెళ్లి సరుకులు తెచ్చుకునే బదులు అదే రోజు డెలివరీ వస్తే ఆన్లైన్ ఆర్డర్ బెటర్ అని వినియోగదారులు అనుకుంటున్నారట.
అవన్నీ లేటే...
ప్రస్తుతం గ్రోసరీ డెలివరీ సేవలు అందించే కంపెనీల్లో అమెజాన్ వంటి బడా సంస్థలు కూడా ఉన్నాయి. స్విగ్గి స్టోర్స్, గ్రోఫెర్స్, డాంజో సహా అనేక ఇతర ఆన్లైన్ గ్రోసరీ సరుకుల డెలివరీ కంపెనీలు మార్కెట్లో ఎంటరయ్యాయి. కానీ ఈ రంగంలోని చాలా కంపెనీలు మరుసటి రోజు డెలివరీ మాత్రమే చేస్తున్నాయి. ఈ కంపెనీలు వాటికి లభించే మొత్తం ఆర్డర్లను స్లాట్స్ గా విభజించి డెలివరీ చేస్తాయి. కానీ ఎక్ష్ప్రెస్స్ డెలివరీ అలా కాదు. ఆర్డర్ వచ్చిన కొద్ది గంటల్లోనే సరుకులను సిద్ధం చేసి డెలివరీ కి పంపాల్సి ఉంటుంది. వినియోగదారులు ఎంపిక చేసుకున్న సమయంలో బిగ్ బాస్కెట్ సరుకులను డెలివరీ చేస్తుంది. అందుకే ఈ సేవలకు ఇటీవల డిమాండ్ అధికంగా ఉంటోందని ఈ కామర్స్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఇలాంటి సేవల ద్వారా కంపెనీకి లాభాలు వస్తాయా లేదా అన్నది మాత్రం అనుమానమే నని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.