కుమ్మక్కు, అలా చేస్తే ప్రాజెక్టులపై భారం: స్టీల్, సిమెంట్ కంపెనీలపై గడ్కరీ సంచలనం
స్టీల్, సిమెంట్ రంగాల్లోని పెద్ద కంపెనీలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచుతున్నాయని ఆరోపించారు. ఇష్టారీతిన ధరలు పెంచకుండా ఉండేందుకు రెగ్యులేటరీ సంస్థ ఏర్పాటు అవశ్యమన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఓ సదస్సులో గడ్కరీ ఈ కంపెనీలు ధరల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ఆరోపణలు గుప్పించారు. ధరలు పెంచేందుకు పెద్ద కంపెనీలు జట్టు కట్టాయన్నారు.
ధరలు పెరిగితే ప్రాజెక్టులపై ప్రభావం
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న రూ.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను మన దేశం సాధించాలంటే పెరుగుతున్న ఉక్కు సిమెంట్ ధరలకు కళ్లెం వేయాలని గడ్కరీ అన్నారు. ఇందుకు కారణం ఉందని, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వచ్చే అయిదేళ్లలో రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులను మౌలిక ప్రాజెక్టులపై పెట్టనుందని, ఉక్కు, సిమెంట్ ధరలు ఇలాగే పెరిగితే ప్రాజెక్టు వ్యయాలు పెరిగి ఇబ్బందులు వస్తాయన్నారు.
సామాన్యులకు ఇబ్బందులు
ధరల పెంపు వల్ల ఇప్పటికే రియాల్టీ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. సాధారణ పౌరులు కూడా ధరలు పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందన్నారు. ఈ అంశంపై ప్రధానితో కార్యాలయ కార్యదర్శితో చర్చించామన్నారు. ఉక్కు పరిశ్రమలోని అన్ని సంస్థలకు సొంతగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయని, కార్మికులు, విద్యుత్ వ్యయాలు పెరగకపోయినా ధరలు పెంచడం సరికాదన్నారు. సిమెంట్ పరిశ్రమ కూడా అలాగే ఉందన్నారు.
రెగ్యులేటర్ పరిశీలన
పెద్ద పెద్ద సిమెంట్, స్టీల్ కంపెనీలు పెంచుతున్న ధరలను అదుపులో పెట్టాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొంటామన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ సూచించినట్లు ఓ రెగ్యులేటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు.