విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకు ఈడీ బిగ్ షాక్ .. సీజ్ చేసిన ఆ ఆస్తులు బ్యాంకులకు బదిలీ
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు పారిపోయిన వైట్ కాలర్ నేరగాళ్లు అయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ మాల్యా ,నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కేసుల్లో సీజ్ చేసిన వేల కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు బదిలీ చేసింది. తాజాగా ఈ ముగ్గురు నుండి సీజ్ చేసిన 8, 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బదిలీ చేయగా, ఇప్పటి వరకు మొత్తం 9, 370 కోట్ల విలువైన రూపాయల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేసినట్టు ఈడీ వెల్లడించింది.
ఈ కామర్స్ సైట్ లకు షాక్ ఇచ్చిన కేంద్రం ... ఇక నుండి ఫ్లాష్ సేల్ కుదరదు
ముగ్గురికి సంబంధించిన 18,170.02 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్
ఇప్పటివరకు ఈ ముగ్గురికి సంబంధించిన 18,170.02 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో విదేశాలలో ఉన్న 969 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జతచేయబడిన మరియు స్వాధీనం చేసుకున్న ఆస్తుల పరిమాణం మొత్తం బ్యాంక్ నష్టంలో 80.45% ను సూచిస్తుంది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మరియు మెహుల్ చోక్సీ లు తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారు. దీనివల్ల బ్యాంకులకు మొత్తం, 22,585.83 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్ధిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న నిర్మలా సీతారామన్
ఇక ఈడీ చర్యతో వైట్ కాలర్ నేరగాళ్ల కేసులలో పురోగతిని గమనించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిపోయిన వారు ఆర్థిక నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, బకాయిలు తిరిగి వసూలు చేస్తామని, అటాచ్ చేసిన ఆస్తుల అమ్మకం ద్వారా బ్యాంకుల బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిపై మనీలాండరింగ్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ముగ్గురు నిందితులపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి.
విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే నిర్ణయం
భారతదేశంలోని బ్యాంకులను మోసం చేసి విదేశాలలో దాక్కున్న వీరిని ఇండియాకి తీసుకురావడం కోసం యూ కె మరియు ఆంటిగ్వా మరియు బార్బుడాకు అప్పగించే అభ్యర్థనలు పంపించారు. విజయ్ మాల్యాను అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది .యుకె హైకోర్టు ధృవీకరించింది. విజయ్ మాల్యాకు యుకె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి అనుమతి నిరాకరించబడినప్పటి నుండి, అతన్ని భారతదేశానికి అప్పగించడం ఫైనల్ అయింది.
నీరవ్ మోదీని , మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకువచ్చే పనిలో కేంద్రం
నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. నీరవ్ మోడీ గత రెండేళ్ళుగా లండన్ జైలులో ఉన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను కూడా ముంబైలోని పిఎంఎల్ఐ కోర్టు ఫ్యుజిటివ్ ఎకనామిక్ అపరాధులుగా ప్రకటించింది. నీరవ్ మోదీ మేనమామ, ఈ భారీ కుంభకోణంలో భాగస్వామి మెహుల్ చోక్సీ కరీబియన్ దీవుల్లో ఉన్నట్టుగా సమాచారం. అతనిని సైతం ఇండియాకి తీసుకురావాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.