Rakesh Jhunjhunwala: పంట పండిందిగా: గంటలో రూ.101 కోట్లు వెనకేసుకున్న బిగ్బుల్
ముంబై: దీపావళి పండగ నాడు నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్.. బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా పంట పండించింది. ఏకంగా వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ముహూరత్ ట్రేడింగ్ జరిగిన గంట వ్యవధిలోనే ఆయన 101 కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోలు లాభాల బాటలో పరుగులు పెట్టాయి. అయిదు టాప్ పోర్ట్ఫోలియోలు రాకేష్ ఝున్ఝున్వాలాను 101 కోట్ల రూపాయల ఆసామిగా మార్చేశాయి
స్తంభించిపోనున్న టాప్ బ్యాంక్ ఆన్లైన్ సర్వీసులు
టాటా మోటార్స్లో..
టాటా గ్రూప్స్కు చెందిన టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, రేటింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్, డెల్టా కార్పొరేషన్ వంటి స్టాక్స్లో రాకేష్ ఝున్ఝున్వాలాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా అవన్నీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టాటా మోటార్స్ ఒక శాతం మేర లాభపడింది ముహూరత్ ట్రేడింగ్ సమయంలో. రూ.490.50 పైసల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కశాతం మేర పెరుగుదల ఆయనకు 17.82 కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టింది. టాటా మోటార్స్లో 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి బిగ్బుల్కు.
ఇండియా హోటల్స్ షేర్లు..
ఇండియా హోటల్స్ షేర్లు మూహూరత్ ట్రేడింగ్ సమయంలో 5.95 మేర లాభపడ్డాయి. 215.45 పైసల వద్ద ట్రేడ్ అయ్యాయి. మొత్తంగా 507.70 కోట్ల రూపాయల మేర పెరిగింది దీని వాల్యూ. ఈ షేర్ల వల్ల రాకేష్ ఝున్ఝున్వాలా 31.13 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించారు. క్రిసిల్ షేర్లు రెండు శాతం మేర పెరిగాయి ఆ ఒక్క గంటలోనే. ఇందులో ఆయనకు 39.75 శాతం ఈక్విటీ షేర్లు ఉన్నాయి. వాటి ద్వారా బిగ్బుల్కు వచ్చిన ఆదాయం 21.72 కోట్ల రూపాయలు. మొత్తంగా క్రిసిల్ షేర్ల విలువ 1,123 కోట్ల నుంచి 1,144 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఎస్కార్ట్.. డెల్టా కార్పొరేషన్
ఇక ఎస్కార్ట్స్ కంపెనీ షేర్లు కూడా బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలాకు ముహూరత్ ట్రేడింగ్ సమయంలోనే 18.11 కోట్ల రూపాయలను సంపాదించి పెట్టాయి. దీని స్టాక్ ప్రైస్ రెండుశాతం మేర పెరిగింది. మొత్తంగా 960 కోట్ల రూపాయల నుంచి 978 కోట్ల రూపాయలకు పెరిగాయి ఈ కంపెనీ షేర్లు. రాకేష్ ఝున్ఝున్వాలాకు 12.60 కోట్ల రూపాయలు ఆర్జించారు. డెల్టా కార్పొరేషన్ స్టాక్స్ పరిస్థితీ ఇంతే. ఈ కంపెనీ షేర్ల విలువ ముహూరత్ ట్రేడింగ్ కొనసాగిన ఆ గంట వ్యవధిలో 3.3 శాతం మేర పెరిగాయి. దీనివల్ల ఆయన పెట్టుబడిన పెట్టుబడి 550.80 కోట్ల రూపాయల నుంచి 563.40 కోట్ల రూపాయలకు పెరిగింది.
అంచనాలకు మించి..
దీపావళి సమయంలో స్టాక్మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారి కోసం ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ఒక గంట మాత్రమే స్టాక్ మార్కెట్స్ తెరిచి ఉంచటం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. దీన్నే ముహూరత్ ట్రేడింగ్గా భావిస్తారు. ఆ ముహూరత్ సమయంలో ట్రేడింగ్ చేస్తే ఐశ్వర్యం తమ వెంట ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. దీపావళి నాడు సాయంత్రం 6:15 నిమిషాల నుంచి 7:15 నిమిషాల వరకు సాగింది ఈ ముహూరత్ ట్రేడింగ్. అంచనాలకు మించి లాభాలను ఇన్వెస్టర్లకు పంచింది.