ఆ సెగ్మెంట్పై ఎయిర్టెల్ ఫోకస్: కంపెనీ షేర్లు కొనుగోలు
ముంబై: దేశీయ టాప్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్.. సొంత అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడంపై దృష్టి సారించింది. డేటా ఎక్స్పర్ట్ కంపెనీ అవాదా కేఎన్షోరాపూర్ ప్రైవేట్ లిమిటెడ్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సొంతంగా విద్యుత్ ఉత్పాదక కంపెనీలను కలిగివుండాలనే నిబంధనలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భారతి ఎయిర్టెల్కు అనుబంధంగా కొనసాగుతున్న ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్- ఇందులో పెట్టుబడులు పెట్టింది.
అవాదా కేఎన్షోరాపూర్కు చెందిన 11.3 శాతం మేర ఈక్విటీలను కొనుగోలు చేసింది. మొత్తంగా 28,07,350 ఈక్విటీలను భారతి ఎయిర్టెల్ డేటా సెంటర్ కొనుగోలు చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్కు 10 రూపాయలను చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటరీకి ప్రతిపాదనలను సమర్పించింది. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా దీన్ని అభివృద్ధి చేయాలనేది తమ ఉద్దేశమని తెలిపింది. సొంత అవసరాల కోసం అవాదా కేఎన్షోరాపూర్ నుంచి విద్యుత్ను తీసుకుంటామని వివరించింది.
ఎలక్ట్రిసిటీ, గ్యాస్, స్టీమ్ అండ్ హాట్ వాటర్ సప్లయర్ కంపెనీగా అవాదా కేఎన్షోరాపూర్ ఏర్పాటైంది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కిందటి సంవత్సరం అక్టోబర్లో ఇది ఇన్కార్పొరేట్ అయింది. 50 మెగావాట్ల మేర విద్యుత్ను ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్ను కర్ణాటకలో నెలకొల్పింది. అవాదా ఇండీక్లీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దీన్ని నడిపిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.
విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. మల్టీ నేషనల్ కంపెనీలు తమ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను నెలకొల్పుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం..- తన సొంత అవసరాల కోసం అవాదా కేఎన్షోరాపూర్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేసుకునేలా అందులో పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను పెట్టడం ద్వారా వచ్చే రిటర్న్స్ను భారతి ఎయిర్టెల్ విద్యుత్ రూపంలో స్వీకరించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.