న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్.. ఎగుమతులపై దృష్టి సారించింది. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్కు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో- ఆ సంస్థ యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఆసియా దేశాల్లో కూడా తన పరిధి, మార్కెట్ను విస్తరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది.
దేశంలో అమల్లో ఉన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ను వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇందులో- సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వాటా అధికం. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా ఇది. ఈ రెండింటితో ఆరంభమైన వ్యాక్సినేషన్లోకి ఆ తరువాత స్పుత్నిక్ వీ వచ్చి చేరింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) దీన్ని అభివృద్ధి చేసింది.

స్పుత్నిక్ వీ వినియోగం పరిమితంగానే ఉంటోంది. తాజాగా- భారత్కే చెందిన జైడుస్ క్యాడిలా వ్యాక్సిన్ జైకోవ్ డీ సైతం అందుబాటులోకి రానుంది. వ్యాక్సినేషన్లో భాగంగా 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికే మాత్రమే టీకా అందుతోంది. 2 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు, యుక్త వయస్సు వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. దీనికి అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇంకా మంజూరు చేయాల్సి ఉంది. దీనిపై అధ్యయనం సాగిస్తోంది.
ఈ పరిణామాల మధ్య కోవాగ్జిన్ డెవలపర్ భారత్ బయోటెక్.. చిన్నపిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే విషయంలో మరో అడుగు ముందుకేసింది. భారత్లో జాప్యం చోటు చేసుకుంటోన్నందున.. పొరుగు దేశాలపై దృష్టి పెట్టింది. వియత్నాంలో చిన్నపిల్లలు, టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి కోరిందీ సంస్థ మేనేజ్మెంట్. దీనికి అవసరమైన ప్రతిపాదనలను పంపించింది. ఇవి పరిశీలన దశలో ఉన్నాయి.
ఈలోగా తమ మార్కెట్ను విస్తరించుకోవడంలో భాగంగా భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వియత్నా ఆరోగ్యశాఖ ఉప మంత్రి డాక్టర్ ట్రాన్ వ్యాన్ థువాన్తో భేటీ అయ్యారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నాసల్ ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ వారిద్దరూ వియత్నాం మంత్రిని కలిసినట్లు చెబుతున్నారు. అలాగే- వియత్నాంకు రెండు లక్షల డోసుల వ్యాక్సిన్ను విరాళంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications