రేపు భారత్ బంద్: బ్యాంకింగ్ సహా పలు సేవలకు అంతరాయం
జనవరి 8వ తేదీన (బుధవారం) వివిధ ఎంప్లాయీస్ యూనియన్లు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు కొన్ని రేపు భారత్ బందుకు పిలుపునిచ్చాయి. ఇందులో బ్యాంకు యూనియన్లు పాల్గొంటున్నాయి. దీంతో బ్యాంకు ఆపరేషన్స్, ఏటీఎంలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే దాదాపు పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు దీనికి మద్దతిస్తున్నాయి. ప్రభుత్వ లేబర్ పాలసీలను నిరసిస్తూ ఈ బందుకు పిలుపునిచ్చాయి. దీంతో దాదాపు అన్ని మేజర్ బ్యాంకులు జనవరి 8న క్లోజ్ అయ్యే అవకాశముంది. అలాగే ఏటీఎం సర్వీస్లలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇబ్బందులు పెద్దగా తలెత్తవని పేర్కొంది. ఇతర కొన్ని చిన్న బ్యాంకుల్లో మాత్రం ఎక్కువ ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఈ సమ్మెలో ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (AIUTUC), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), హింద్ మజ్దూర్ సభ (HMS), సెల్ఫ్ ఎంప్లాయిడ్ వుమెన్స్ అసోసియేషన్ (SEWA) పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (AICCTU), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (TUCC) కూడా పాల్గొంటున్నాయి.
లేబర్ పాలసీలు మార్చాలని, ప్రయివేటీకరణ చేయవద్దనేది వీరి ప్రధాన డిమాండ్. దీంతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంశాలు కూడా ఉన్నాయి. విద్యా సంస్థల్లో పెరిగిన ఫీజులు, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా 60 విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాలకు చెందిన పలు సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మె కారణంగా బుధవారం పలు రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, రవాణా రంగాలపై ప్రభావం ఎక్కువగా పడనుంది.