బెంగళూరులో పీజీలన్నీ షట్డౌన్..మూసేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓనర్స్.. !
Bengaluru's PG Crisis Deepens: భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీ అయిన బెంగుళూరు ఇప్పుడు తీవ్ర ఐటీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. నగరంలోని టాప్ కంపెనీలు లేఆప్స్ బాటపడుతున్నాయి. దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డు మీదకు వస్తున్నారు. అయితే ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు బెంగుళూరును ఖాళా చేస్తుండటంతో దీని ప్రభావం పీజీల మీద పడుతోంది. తాజాగా నెలకొన్న ఐటీ సంక్షోభం వల్ల బెంగుళూరులో పీజీలు ఖాళీ అవుతున్నాయి.
టెక్ కంపెనీలతో పాటుగా ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండటంతో అందరూ నగరంలోని పీజీలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఈనేపథ్యంలోనే చాలా చోట్ల పీజీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే నష్టాల బాట పట్టిన యజమానులు పీజీలను మూసివేస్తున్నారు. ఐటీకీ కేరాఫ్ అడ్రస్ అయిన ఎలక్ట్రానిక్ సిటీ, మార్తహళ్లి ఏరియాల్లో చాలా చోట్ల పీజీలు మూతపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం చేపట్టిన కఠినపరమైన నియమాలు కూడా పీజీల మూసివేతకు కారణం అవుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన కళకళలాడే పీజీలు ఇప్పుడు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి.

దూసుకొస్తున్న ఆర్థికమాంద్యంతో ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి.ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక గతంలో వచ్చిన మహమ్మారి బెంగుళూరు నగరాన్ని భారీగా దెబ్బతీసింది.ఈ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకున్న పీజీ యజమానులు ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్థికంగా స్థిరపడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు ఉద్యోగులను బయటకు పంపడంతో మళ్లీ వీరి పరిస్థితి మొదటికొచ్చింది. టెక్ లేఆఫ్స్ తో పీజీలు ఖాళీ చేసి వెళుతున్న వారిసంఖ్య పెరుగుతుండటంతో పీజీ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
మహదేవపుర, మార్తహళ్లి వంటి ప్రాంతాలలో పీజీలు 25 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అక్కడ ప్రతి రోజు రెండు పీజీలు క్లోజ్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. దీనిపై ప్రముఖ పెట్టుబడి సలహాదారు హార్థిక్ జోషి లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు.ఆయన పోస్టులో ఇది వేలాది మందిని ప్రభావితం చేసే సైలెంట్ సంక్షోభం అని చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది బీబీఎంపీ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. BBMP 2020లోని సెక్షన్ 305 కింద నగరంలోని పీజీలకు కొన్ని కఠిన నియమ నిబంధనలను ప్రవేశపెట్టింది. దీంతో ఆ నిబంధనలు పీజీ యజమానుల పాలిట శాపంలా మారాయి.
ఈ నిబంధనలను ఓ సారి పరిశీలిస్తే.. పీజీ యజమానులు ఇప్పుడు ట్రేడ్ లైసెన్సులు పొందాలి. అలాగే నీట్ నెస్ తో పాటుగా ఫైర్ సేప్టీ వంటి రక్షణ చర్యలను తీసుకోవాలి. పీజీలకు వెడల్పాటి రహదారులు ఉండాలి. నలబై అడుగుల కంటే ఇరుకైన రోడ్లపై పీజీలను నడపకూడదు. ఈ లైసెన్సులు ఉల్లఘించిన పీజీలను ప్రభుత్వం ఇప్పటికే షట్ డౌన్ చేసింది. మహదేవపుర జోన్లోనే ఏప్రిల్ నెలలో ఏకంగా 100 కి పైగా పీజీలను సీజ్ చేశారు.ఇక మరో కఠిన నిబంధన ఏంటంటే.. అన్ని సాధారణ ప్రాంతాలను కవర్ చేస్తూ CCTV కెమెరాలను ఏర్పాటు చేయవలసి రావడం.. పీజీలో ఉండే ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 135 లీటర్ల నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడం..ఇవన్నీ పీజీ యజమానుల పాలిట శాపంలా మారాయి. ఈ నిబంధనలు ఇప్పటికే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న యజమానుల నిర్వహణ ఖర్చులను భారీగా పెంచాయి.
బెంగళూరు పీజీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుఖి సియో ప్రముఖ జాతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ..బెంగుళూరు నగరంలో 12,000 పీజీలు ఉంటే వాటిలో కేవలం 2,500 పీజీలు మాత్రమే అధికారికంగా నమోదు చేసుకున్నాయని తెలిపారు. నగరంలో 10 వేల పీజీలు ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నాయని తెలిపారు. దీంతో వారిలో ఆందోళన మొదలైందని..ఏ క్షణమైనా బీబీఎంపీ అధికారులు దాడులు చేస్తారేమోననే భయం నెలకొందని చెప్పుకొచ్చారు.
దీనికి తోడు బెంగుళూరు నీటి సరఫరా అధికారులతో పాటు మురుగు నీటి పారుదల బోర్డు ఛార్జీలను పెంచడం కూడా పీజీ యజమానులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తోంది. ఈ ఖర్చులన్నీ పీజీ యజమానులు రెంట్ కు ఉండే వ్యక్తులపై మోపలేకున్నారు. బెంగుళూరు నగరానికి ఆర్థికంగా పటిష్ఠ స్థితిని అందించే పీజీలకు ఇలాంటి కష్టకాలం నిజంగా బాధాకరమనే చెప్పుకోవాలి. టెక్ రంగంలో దూసుకుపోతున్న నగరంలో ఇలాంటి దుస్థితిపై ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.