Crypto Chaiwala: కాలేజీ డ్రాపవుట్.. బెంగళూరు క్రిప్టో చాయ్ వాలా.. సోషల్ మీడియాలో వైరల్..
Crypto Chaiwala: కర్ణాటక రాజధాని బెంగళూరును మనం సిలికాన్ సిటీ అని పిలుస్తుంటాం. ఎందుకంటే అక్కడ అందరూ టెక్కీలు, క్వాలిఫైడ్ ఉద్యోగులు కంపెనీల్లో పనిచేస్తుంటారు. అక్కడ సాంకేతికతకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. పైగా కొత్తగా ఆలోచించేవారికి స్టార్టప్ సిటీ ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. అక్కడ ఒక చాయ్ వాలా చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
ట్విట్టర్ లో ట్రెండింగ్..
కాలేజ్ డ్రాపవుట్ టీ స్టాల్ ప్రస్తుతం బెంగళూరు నగర ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే అతను యువతను ఆకట్టుకునేందుకు క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించటమే. అవును ఫ్రస్ట్రేటెడ్ డ్రాపౌట్ పేరుతో టీ దుకాణం తెరిచిన సుభమ్ సైనీ అనే యువకుడు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే అనేక మంది యువత ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్, క్రిప్టో కరెన్సీలు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
షాప్ వైరల్..
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న ఫోటోలోని కనిపిస్తున్న సుభమ్ టేబుల్పై ఉన్న మ్యాగీ, పాస్తా ప్యాకెట్ మధ్య టీ తయారు చేస్తూ ఉంటాడు. పైగా అతడు క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ను పేమెంట్గా స్వీకరిస్తున్నట్లు తన షాప్లో ఓ బోర్డు కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ షాప్ బెంగళూరు టెక్కీలను తెగ ఆకట్టుకుంటోంది.
ఎందుకీ నిర్ణయం..
సుభమ్ సైనీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అప్పట్లో వాటినుంచి భారీగా లాభాలను సైతం పొందాడు. అయితే 2021 ఏప్రిల్ తర్వాత అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రిప్టో మార్కెట్లు కుప్పకూలటం, భారత ప్రభుత్వం క్రిప్టోలపై ఉక్కుపాదం మోపటంతో అతని జీవితం తారుమారైంది. దీంతో చేసేదేం లేక అతడు రోడ్డు పక్కన ఒక టీ దుకాణాన్ని తెరిచాడు.
అందరినీ ఆకర్షించేందుకు..
కస్టమర్లను ఆకర్షించేందుకు, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వంటి హానికరమైన పదార్థాల వినియోగాన్ని తగ్గించాడు. మట్టితో చేసిన గ్లాసుల్లో టీ సర్వ్ చేస్తున్నాడు. పైగా క్రిప్టోలను అంగీకరించటం వల్ల టీ అమ్మకాలు సైతం భారీగా పెరిగాయని సైనీ చెబుతున్నాడు. ప్రతి వారం కనీసం 20 మంది కస్టమర్లు తనకు క్రిప్టోకరెన్సీల రూపంలో చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించాడు.
రాత్రికి రాత్రే మారిన జీవితం..
ఒకప్పుడు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా మాదిరిగా ఫీల్ అయ్యేవాడు. అప్పట్లో క్రిప్టో కరెన్సీల్లో రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేసి నెలల వ్యవధిలో అతడు రూ.30 లక్షలు సంపాదించాడు. అయితే 2019లో క్రిప్టో మార్కెట్ క్రాష్తో పరిస్థితి తారుమారు కావటంతో రూ.30 లక్షలు.. లక్షకు పడిపోయాయని సుభమ్ తెలిపాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేవలం ఒక్క రాత్రితో తన జీవితం పూర్తిగా తారుమారైందని చెప్పాడు.