బ్రిటానియా టు బాటా: కొత్త సీఈఓ అపాయింట్
ముంబై: బాటా ఇండియా కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారి నియామకం పూర్తయింది. కొత్త సీఈఓగా గుంజన్ షా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదివరకు ఆయన.. బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. బ్రిటానియా బ్రాండింగ్ను అంతర్జాతీయ స్థాయికి తీసకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటానియా ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు గుంజన్ షా అనుసరించిన వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని.. ఆయనను బాటా సీఈఓగా నియమించినట్లు సందీప్ కఠారియా తెలిపారు. బాలా ఇండియాకు ప్రస్తుతం ఆయనే సీఈఓ. తన స్థానంలో గుంజన్ షా నియమితులు కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
2007లో బ్రిటానియా ఇండస్ట్రీస్లో చేరారు గుంజన్ షా. అంతకుముందు ఏసియన్ పెయింట్స్, మోటొరొలాల్లో కీలక హోదాల్లో పనిచేశారు. వివిధ మల్టీ బ్రాండింగ్స్ కంపెనీల్లో వేర్వేరు హోదాల్లో పనిచేసిన గుంజన్ షాకు దేశీయ మార్కెట్పై గట్టి పట్టు ఉందని బాటా ఇండియా ఛైర్మన్ అశ్వనీ విండ్లాస్ తెలిపారు. ఆయన సారథ్యంలో బాటా ఇండియా- మరింత అద్భుతమైన పనితీరును సాధిస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయిలో తమ బ్రాండింగ్ను విస్తరించడానికి అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు గుంజన్ షా రూపొందిచగలరని అన్నారు.
కోల్కతలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి గుంజన్ షా. కన్జ్యూమర్ డ్యూరబల్స్, టెలికమ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లలో వేర్వేరు హోదాల్లో పనిచేశారు. బాటా బ్రాండింగ్.. దేశ ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగంగా మారిందని, దాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. బాటాతో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్గా ఉందని, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ సంస్థ ఓ అద్భుత ప్లాట్ఫామ్గా భావిస్తున్నానని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో బాటా ఉత్పత్తులను తీసుకెళ్లాలనేది తన లక్ష్యమని చెప్పారు. పాదరక్షల రంగంలో పోటీని అధిగమించి, ముందుకెళ్లడం సవాళ్లతో కూడుకుని ఉన్నదని వ్యాఖ్యానించారు.