బ్యాంకు ఉద్యోగులకు సర్ప్రైజ్ లీవులు: కనీసం 10 రోజులు: ఆర్బీఐ
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి సుదీర్ఘకాలం పాటు అమలు చేసిన లాక్డౌన్ తరహా పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు యధాతథంగా పని చేశాయి. ఎప్పట్లాగే బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. తమ లావాదేవీలను కొనసాగించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ పరిణామాల మధ్య పలువురు బ్యాంకు ఉద్యోగులు శారీరక, మానసిక ఒత్తిడినీ ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank) కొన్ని కీలక మార్గదర్శకాలను రూపొందించింది. రిస్క్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనితోపాటు- మోసాలను నివారించడానికీ ఈ మార్గదర్శకాలను వర్తింపజేసింది. ఈ మార్గదర్శకాల కింద- ఎంపిక చేసిన కొందరు బ్యాంకు ఉద్యోగులను ఆకస్మిక సెలవుల్లోకి పంపించాలని రిజర్వుబ్యాంక్ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. సెలవుల్లోకి పంపించదలిచిన ఉద్యోగులకు ముందస్తుగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకూడదని సూచించింది.
ఆకస్మికంగా వారిని సెలవుల్లోకి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సెలవుల వ్యవధి 10 రోజుల కంటే తక్కువగా ఉండకూడదని తెలిపింది. ఒక ఉద్యోగి ఒకసారి సర్ప్రైజ్ లీవుల్లోకి వెళితే.. అది తప్పనిసరిగా 10 రోజులకు పైగా ఉండాలని రిజర్వుబ్యాంకు పేర్కొంది. కీలక హోదాల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసి, తమ కార్యాలయానికి పంపించాలని రిజర్వుబ్యాంక్..బ్యాంకర్లకు ఆదేశించింది. ప్రతి సంవత్సరమూ దీన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది.
నిజానికి- ఈ తరహా తప్పనిసరి సెలవులను అమలు చేయడం రిజర్వుబ్యాంక్కు కొత్తేమీ కాదు. ఇదివరకు 2015 ఏప్రిల్లో ఈ తరహా సర్కులర్ను జారీ చేసింది. మోసాలను నివారించడానికి దీన్ని అమలు చేసింది. అప్పటి ఆదేశాలను తాజాగా అప్డేట్ చేసింది. శారీరకంగా గానీ, వర్చువల్ విధానంలో గానీ ఆ ఉద్యోగులు యాక్సెస్ ఉండకూడదని తన మార్గదర్శకాల్లో పేర్కొంది. సర్కులర్ను జారీ చేసిన ఆరు నెలల్లోగా దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని ఆర్బీఐ ఆదేశించింది.