మాల్యా, నీరవ్, చోక్సీ నుండి రూ.18వేల కోట్లు బ్యాంకులకు ట్రాన్సుఫర్, ఇంకా ఎంత ఉందంటే?
నల్లధనాన్ని వెనక్కి తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ క్రమంగా అక్రమార్కుల నుండి నల్లధనాన్ని మాత్రం వెనక్కి తెప్పిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లు వెనక్కి వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
4700 కేసుల దర్యాఫ్తు
మాల్యా, నీరవ్, మెహుల్ చోక్సీల నుండి రూ.18,000 కోట్లను తిరిగి బ్యాంకులకు బదలీ చేశామని సొలిసిటర్ జనరల్ తుషారమ మెహతా భారత అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసుల్లో ఈడీ విస్తృత అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశవరి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం-PMLA కింద నమోదైన 4700 కేసులను ఈడీ దర్యాఫ్తు చేస్తోందని తెలిపారు.
మొత్తం రూ.67,000 కోట్లు
గత అయిదేళ్లుగా ప్రతి సంవత్సరం విచారణ కోసం తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కాగా, 2020-21 నాటికి 981 కేసులుగా నమోదయిందని తెలిపారు. గత అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయినట్లు తెలిపారు. చోక్సీ, మాల్యా, నీరవ్ల కేసులో బ్యాంకులకు రూ.18,000 కోట్లు తిరిగి వచ్చాయని మెహతా ధర్మాసనంకు తెలిపారు. కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న నేరాల సంఖ్య మొత్తం వ్యాల్యూ రూ.67,000 కోట్లుగా ఉందన్నారు. కానీ ఆయా కేసుల్లో కోర్టుల ఆదేశాలు రికవరీకి అడ్డంకిగా మారినట్లు తెలిపారు. కఠినమైన బెయిల్ షరతులు, అరెస్టులకు సంబంధించి సమాచార లోపం, ఈసీఐఆర్ ఇవ్వకుండా అరెస్టు చేయడం వంటివి జరుగుతున్నాయన్నారు.
మన వద్ద తక్కువ
భారత్లో ఈడీ నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం బ్రిటన్లో PMLA కింద 7900 కేసులు, అమెరికాలో 1532 కేసులు, చైనాలో 4691 కేసులు, ఆస్ట్రియాలో 1036 కేసులు, హాంగ్కాంగ్లో 1823 కేసులు, బెల్జియంలో 1862 కేసులు, రష్యాలో 2764 కేసులు నమోదవుతున్నాయి. అయిదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులు 2086 మాత్రమే అన్నారు. కానీ వాస్తవానికి అయిదేళ్లలో 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు.