బ్యాంకుల ప్రయివేటీకరణ: మార్చి 15, 16 తేదీల్లో ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు మళ్లీ సమ్మెకు సిద్ధమయ్యారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(PSB) ప్రయివేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ మార్చి 15, 16 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించారు. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు PSBలను ప్రయివేటీకరిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను వ్యతిరేకించాలని నిన్నటి సమావేశంలో నిర్ణయించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఐడీబీఐ బ్యాంకును, మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరణ చేయాలని బడ్జెట్లో ప్రకటించారని, అలాగే, బ్యాడ్ బ్యాంకును ప్రతిపాదించారని, ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపారని, అలాగే బీమా రంగంలో 74 శాతం ఎఫ్డీఐలకు అనుమతులు ఇస్తున్నారని గుర్తుచేశారు.
అయితే బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 15, 16న రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. UFBUలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్(AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ బ్యాంకు ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంకు ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(BEFI) ఉన్నాయి.